గంటకు పైగా నిలిచిన ఎయిర్ఇండియా విమానం
న్యూఢిల్లీ: టిఫిన్ బాక్స్కడిగే విషయంపై పైలట్, ఫ్లైట్ సిబ్బంది మధ్య చిన్నగా మొదలైన వివాదం ఏకంగా ఓ విమానాన్ని గంటసేపు నిలిపేసింది. అంతేనా.. ఇకపై ఎవరూ బాక్స్లు తీసుకురావొద్దని ఆదేశాలు జారీచేసేదాకా వెళ్లింది. బెంగళూరు–కోల్కతా ఎయిర్ఇండియా(ఏఐ) విమానంలో సోమవార ఈ ఘటన చోటుచేసుకుంది.
సోమవారం ఉదయం 11.40 నిమిషాలు.. బెంగళూరు ఎయిర్పోర్టు రన్వే పై ఏఐ772 విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. టేకాఫ్కు సిద్ధపడుతున్న క్రమంలో పైలట్ తన లంచ్బాక్స్ను కడగాలని విమాన సిబ్బందికి సూచించారు. దీనిపై పైలట్కు, సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాదోపవాదాల నేపథ్యంలో పైలట్తన డ్యూటీ విషయమే పట్టించుకోలేదు. గాల్లోకి లేవాల్సిన విమానం రన్వే పైనుంచి కదలకపోవడంతో అధికారులు ఆరా తీయగా ఈ గొడవ బయటికొచ్చింది. దీంతో అధికారులు ఇద్దరినీ మందలించారు. వారిని తప్పించి వేరే ఉద్యోగులతో విమానాన్ని కోల్కతాకు పంపించారు. ఈ తతంగంతో ఫ్లైట్ 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు, ఇకపై డ్యూటీకి హాజరయ్యే సిబ్బంది లంచ్ బాక్స్లు తీసుకురావొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై డీజీసీఏకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు చెప్పారు.