పెరగనున్న విమాన టికెట్ ధరలు.. లిమిట్‌‌ తీసేసిన ప్రభుత్వం

పెరగనున్న విమాన టికెట్ ధరలు.. లిమిట్‌‌ తీసేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ:  దేశీయ విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని  ప్రభుత్వం  తొలగించింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఇండిగో సంక్షోభం టైమ్‌‌లో ధరలు విపరీతంగా పెరగకుండా ఉండేందుకు   ప్రభుత్వం టికెట్ రేట్లపై లిమిట్ పెట్టింది. తాజాగా దీనిని తొలగించింది.

 “ ఇండిగో సంక్షోభం టైమ్‌‌లో ఉన్న  పరిస్థితులు ఇప్పుడు లేవు. కంపెనీలు తమ సామర్ధ్యాన్ని పెంచాయి.  అందుకే ధరల పరిమితిని తొలగించాం” అని సివిల్ ఏవియేషన్  మినిస్ట్రీ పేర్కొంది. అయితే, ఎయిర్‌‌లైన్ కంపెనీలు  మార్కెట్‌‌ పరిస్థితులకు అనుగుణంగా,  పారదర్శకంగా ధరలను నిర్ణయించాలని ఆదేశించింది. 

 గతంలో ప్రభుత్వం 500 కి.మీ. లోపు దూరం ఉంటే  రూ.7,500, ఐదు వందల నుంచి వెయ్యి  కి.మీ. లోపు ఉంటే రూ.12,000, వెయ్యి నుంచి పదిహేను వందల  కి.మీ లోపు ఉంటే రూ.15,000,  పదిహేను వందల  కి.మీ పైగా ఉంటే  రూ.18,000గా లిమిట్‌‌ పెట్టింది. ఎయిర్‌‌లైన్స్ పెరిగిన ఇంధన ధరలు, ఆపరేషనల్ ఖర్చుల కారణంగా వచ్చిన నష్టాలను చూపిస్తూ ధరల పరిమితి తొలగించాలని గతంలో ప్రభుత్వాన్ని కోరాయి.