అమెరికా చార్జీలు పెంచిన విమానయాన సంస్థలు 

అమెరికా చార్జీలు పెంచిన విమానయాన సంస్థలు 

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానయాన సంస్థలు షాకిచ్చాయి. విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. కరోనా కారణంగా విమానాలు పరిమితంగా నడవడం, అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే ఇందుకు కారణం. మన దేశంతోపాటు అమెరికాలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు వీసా జారీ ప్రక్రియను మొదలుపెట్టాయి.

వచ్చే నెల నుంచి అమెరికాలోని వర్శిటీలు తెరుచుకోనున్నాయి. దీంతో మొదట విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేస్తున్నాయి. ఈసారి చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు వీసాలు లభించినట్టు తెలుస్తోంది. వీరందరూ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అంతర్జాయ విమాన సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. దీంతో అమెరికాకు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా సేవలు లేకపోవడంతో ఆయా సంస్థలు విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. మామూలుగా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ. 60 వేలు..అయితే ఇప్పుడది రూ. 90 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు ఉంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో మాత్రం రూ. 90 వేలుగా ఉంది.