
హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న ఆన్ లైన్ మోసాల నుంచి తెలంగాణ లోని కస్టమర్ లను రక్షించే మిషన్ లో గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్టెల్ ప్రకటించింది. తన ఏఐ -ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ దేశవ్యాప్తంగా 1.80 లక్షల హానికరమైన లింక్లను విజయవంతంగా బ్లాక్ చేసిందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 54 లక్షల మంది కస్టమర్లను రక్షించామని పేర్కొంది. ఫ్రాడ్ -డిటెక్షన్ సిస్టమ్ ను ప్రారంభించిన కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించామని తెలిపింది.
ఎయిర్ టెల్ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ లకు ఆటోమేటిక్ గా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇది ఎస్ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ–-మెయిల్ ఇతర బ్రౌజర్లలో లింక్ లను స్కాన్ చేస్తుంది. ఫిల్టర్ చేస్తుంది. ఇది ప్రతిరోజూ 100 కోట్ల యూఆర్ఎల్ లను పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. హానికరమైన సైట్లకు 100 మిల్లీ సెకన్లలో యాక్సెస్ ను ఆపుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట వంటి నగరాల్లో ఫిషింగ్ లింకులు, నకిలీ డెలివరీలు, నకిలీ బ్యాంకింగ్ అలర్ట్స్ వంటి మోసాలు భారీగా జరుగుతున్నాయని ఎయిర్టెల్ తెలిపింది.