జియో–గూగుల్ కు ధీటుగా ఎయిర్ టెల్ 4జీ ఫోన్
2 జీ ఫీచర్ ఫోన్ యూజర్లే టార్గెట్
8 జీబీ ర్యామ్, 5 ఇంచుల స్క్రీన్
ఫోన్ రూ. 2,500 కే
న్యూఢిల్లీ: తక్కువ ధరలోనే 4జీ ఫోన్ను తయారు చేసేందుకు టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ రెడీ అవుతోంది. దీని కోసం మొబైల్ ఫోన్లను తయారు చేసే కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లతో కంపెనీ చర్చిస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ఫోన్లను తన సొంత బ్రాండ్తో అమ్మాలని చూస్తోందని అన్నారు. తక్కువ ధరకే 4జీ మొబైల్స్ తెచ్చేందుకు గతంలో రిలయన్స్ జియో, గూగుల్ పార్టనర్షిప్ కుదుర్చుకున్నాయి. ఒక వేళ ఎయిర్టెల్ ఈ ఫోన్లను తీసుకొస్తే జియో–గూగుల్కు గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 2 జీ ఫీచర్ ఫోన్లను వాడుతున్నవారు 40 కోట్లకు పైగా ఉంటారని అంచనా. వీరిని 4 జీ నెట్వర్క్ పై తీసుకొచ్చేందుకు ఈ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తక్కువ ధరలోనే 4 జీ మొబైల్స్ను తెచ్చేందుకు లావా, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి మొబైల్ తయారీ కంపెనీలతో ఎయిర్టెల్ చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం బీసీజీని తన కన్సల్టెంట్గా ఎయిర్టెల్ నియమించుకుందని చెప్పారు. ఇప్పటికే ఉన్న 2జీ యూజర్లను 4జీ కి మార్చాలని, దీంతో కంపెనీ యావరేజి రెవెన్యూ పెర్ యూజర్(ఆర్పూ) ను పెంచుకోవాలని ఎయిర్టెల్ ప్లాన్స్ వేస్తోంది. ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రిలిమినరీ దశలోనే ఉన్నాయని తెలిసిన వ్యక్తులు అన్నారు. ఎయిర్టెల్ తెచ్చే 4 జీ ఫోన్లో 5 ఇంచుల స్క్రీన్, 8 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉంటాయని, ఈ ఫోన్ను రూ. 2,500 కే కంపెనీ తీసుకురానుందని చెప్పారు. ఈ ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ లాక్ అయి ఉంటుందని, ఈ సిమ్ కార్డు డేటా ప్యాక్తో వస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఈ 4జీ ఫోన్లను ఎయిర్టెల్ తయారు చేయకపోతే, వీటిని బల్క్గా కొని, కంపెనీ తన బ్రాండ్తో అమ్మొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై ఎయిర్టెల్ స్పందించలేదు. తమ క్లయింట్స్కు సంబంధించి ఎటువంటి వివరాలను బయటపెట్టమని బీసీజీ తెలిపింది.
జియో-గూగుల్ 4జీ ఫోన్ ఆలస్యమవుతుందా?
గూగుల్తో కలిసి తక్కువ ధరలోనే 4జీ మొబైల్ ఫోన్ను తీసుకురానున్నామని గతంలో జియో ప్రకటించింది. కుదిరితే 5 జీ ఫోన్ను కూడా తెస్తామని తెలిపింది. వీటిని ఇండియాతో పాటు గ్లోబల్గానూ విక్రయిస్తామని ప్రకటించింది. కానీ ఈ ఫోన్ ఇప్పటిలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఆపరేటింగ్ సిస్టమ్ను కంపెనీ మొదట డెవలప్ చేయాల్సి ఉందని, ఈ ఫోన్ లాంఛ్కు టైమ్ పట్టొచ్చని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి తక్కువ ధరలో 4 జీ ఫోన్ను తీసుకురావడం అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఇంకా 40 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారు. గతంలో జియో తీసుకొచ్చిన 4 జీ ఫీచర్ ఫోన్ యూజర్లు 6 కోట్లకు పైగా ఉంటారని అంచనా. ఈ మార్కెట్ను అందిపుచ్చుకునేందుకు జియో–గూగుల్, భారతీ ఎయిర్టెల్లు పోటీపడుతున్నాయి. జియో కస్టమర్లలో 4జీ యూజర్లు మాత్రమే ఉన్నారు. కానీ ఎయిర్టెల్ యూజర్లలో 28 కోట్లకు పైగా యూజర్లు ఇంకా 2జీ, 3జీ నెట్వర్క్లను వాడుతున్నవారే.
4జీ కి మారడం లేదు..
4జీ నెట్వర్క్కు మారుతున్న వారు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో భారీగా తగ్గారు. జనవరి–మార్చి క్వార్టర్లో 4జీ నెట్వర్క్కు మారిన వారు 5.3 శాతంగా ఉండగా, ఈ జూన్ క్వార్టర్లో మైనస్ 1.7 శాతంగా నమోదయ్యారు. గత రెండేళ్ల నుంచి 4జీ నెట్వర్క్కు మారుతున్నవారి సంఖ్య తగ్గుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. అఫర్డ్బులిటీ కారణంగానే 2జీ లేదా 3 జీ ఫీచర్ ఫోన్లను చాలా మంది వాడుతున్నారని చెప్పారు. గతంలో 4జీ సిమ్ కార్డుతో వచ్చిన జియో ఫోన్ కూడా అంచనాలను అందుకోలేకపోయిందని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్తో పోల్చుకుంటే 4 జీ ఎక్స్పీరియన్స్ తగ్గడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎయిర్టెల్ ఈ సెగ్మెంట్లోకి వస్తే లోకల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లకు మంచి డిమాండ్ వస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వలన ఇండియన్ కంపెనీలకు ప్రొత్సాహకాలు అందుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఎయిర్టెల్తో కలిపి చాలా కంపెనీలు ఇక్కడి మాన్యుఫాక్చరర్ల వైపు చూస్తున్నారని అంటున్నారు. కాగా, లావా, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి కంపెనీలు పీఎల్ఐ స్కీము కింద అప్లై చేసుకున్నాయి.