- అయినా ఓ ఎజెండా ప్రకారమే దుష్ప్రచారం: కేకేఆర్ కెప్టెన్ రహానె
కోల్కతా: ఐపీఎల్ 19వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న తర్వాత తన స్ట్రయిక్ రేట్పై వస్తున్న విమర్శలకు ఆ టీమ్ కెప్టెన్ అజింక్యా రహానె ఘాటుగా సమాధానమిచ్చాడు. ఈ విమర్శల వెనుక ఒక నిర్దిష్ట ఎజెండా, అసూయ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
గురువారం ఈడెన్ గార్డెన్స్లో సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 227 టార్గెట్ ఛేజింగ్లో రహానె 10 బాల్స్లో 8 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. ‘2020 నుంచి నా స్ట్రయిక్ రేట్ బాగానే ఉంది. దీనిపై విమర్శలు చేసే వారు బహుశా నా ఆటను చూడటం లేదనుకుంటా. లేదంటే నేనంటే గిట్టనివారు అయి ఉండాలి. నేను ఆడటం వాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన కెరీర్లో సాధించిన విజయాలను చూసి కొందరు అసూయపడుతున్నారని, అందుకే ప్రతికూల ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు. సన్ రైజర్స్తో మ్యాచ్లో మంచి ఆరంభం లభించినప్పటికీ 16 ఓవర్లలో 161 రన్స్కే ఆలౌటైన కేకేఆర్ చిత్తుగా ఓడింది. పవర్ ప్లేలో ఫిన్ అలెన్ మెరుపు ఆరంభం ఇచ్చినప్పటికీ, మిడిల్ ఓవర్లలో మంచి భాగస్వామ్యాలు లేకపోవడం ఓటమికి కారణమైందని రహానె అన్నాడు. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్తో సొంతగడ్డపై జరిగే తర్వాతి మ్యాచ్ల్లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
