
- రూ.500 కోట్ల కమీషన్ల కోసమే చెన్నూరు లిఫ్ట్: ఆకునూరి మురళి
- కాళేశ్వరం కమీషన్లతోనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్: కోదండరామ్
- చెన్నూరు ఎత్తిపోతలు వద్దని అఖిలపక్ష సమావేశంలో తీర్మానం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్తున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ప్రాజెక్టు కాదని, అది ఒక చెత్త ప్రాజెక్టు అని రిటైర్డ్ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. ‘గ్రావిటీతో నీళ్లొస్తుంటే చెన్నూరు ఎత్తిపోతలు ఎందుకు’ అనే అంశంపై గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ జల సాధన సమితి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేండ్ల క్రితమే ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నుంచి 154 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని, అందులో 50 టీఎంసీలకు పైగా నీళ్లను మళ్లీ నదిలోకే
వదిలేశారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు చెప్తున్నాయన్నారు. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు ఎఫిషియెన్సీ18 శాతమేనని, థర్డ్టీఎంసీ కూడా ప్రారంభిస్తే ఇది ఇంకా తగ్గిపోతుందన్నారు. ‘‘ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టుతో రూ.లక్ష ఖర్చవుతుంది. ఎత్తిపోతల కోసం ఏటా 5 వేల మెగావాట్ల కరెంట్అవసరమవుతుంది. బుద్ధి ఉన్నోడెవడూ ఈ ప్రాజెక్టును కొనసాగించడు” అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్అయితే.. అది ఎలాగో సీఎం కేసీఆర్ప్రెస్మీట్పెట్టి వివరించాలని సవాల్విసిరారు.
కమీషన్ల కోసమే చెన్నూరు లిఫ్ట్..
సీఎం కేసీఆర్ కు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్దత్తపుత్రుడని, ఇద్దరూ కమీషన్లు మింగేందుకే చెన్నూరు లిఫ్ట్ స్కీం చేపట్టారని మురళి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో రూ.500 కోట్ల కమిషన్లు పొందాలని టార్గెట్గా పెట్టుకున్నారని తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్సహా ఏ ప్రాజెక్టు కట్టినపుడు కూడా అప్పటి సీఎంలు జోక్యం చేసుకోలేదని, కేసీఆర్తానే చీఫ్ఇంజనీర్గా మారి ప్రాజెక్టు కట్టారు కాబట్టే కాళేశ్వరం పంపుహౌస్లు మునిగాయన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాళేశ్వరం, చెన్నూరు లిఫ్ట్ లాంటి ప్రాజెక్టులు చేపట్టిన కేసీఆర్పై న్యాయపోరాటం చేసి జైలుకు పంపాలన్నారు.
గ్రావిటీతో నీళ్లొస్తుంటే.. లిఫ్ట్ ఎందుకు?: కోదండరామ్
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేఘా కృష్ణారెడ్డి ప్రపంచంలోనే కుబేరుడు అయితే కేసీఆర్ ఈ ప్రాజెక్టు కమీషన్లతోనే జాతీయ రాజకీయాల్లోకి పోతున్నారని టీజేఎస్అధ్యక్షుడు ప్రొఫెసర్కోదండరామ్అన్నారు. ప్రాణహిత – చేవెళ్ల రీ డిజైనింగ్తో మంచిర్యాల, ఆసిఫాబాద్జిల్లాలకు తీవ్రనష్టం జరిగిందన్నారు. తాను సీఎం కేసీఆర్ను చివరిసారి కలిసినప్పుడు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తే కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే ముందే తుమ్మిడిహెట్టికి శంకుస్థాపన చేస్తామన్న కేసీఆర్ఇప్పుడు ఆ ప్రాజెక్టే లేకుండా చేశారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గడ్డెన్నవాగు, వట్టివాగు ప్రాజెక్టులకు కాల్వలే లేవన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి కట్టండి.. ఆదిలాబాద్తూర్పు జిల్లాకు నీళ్లివ్వండి” అనే నినాదంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ శుక్రవారమే చెన్నూరు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేస్తున్నారని, తుమ్మిడిహెట్టి కట్టాలనే డిమాండ్తో మంచిర్యాలలో పోస్టర్లు వేద్దామని సూచించారు. తుమ్మిడిహెట్టి నుంచి చెన్నూరుకు గ్రావిటీతోనే నీళ్లు వస్తాయని, అలాంటప్పుడు ఎత్తిపోతలు అవసరమే లేదన్నారు. కాళేశ్వరం పేరుతో రీడిజైనింగ్చేయకుండా తుమ్మిడిహెట్టి కట్టి ఉంటే తెలంగాణ అప్పుల పాలయ్యేదే కాదన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన మొత్తంతో 33 పెండింగ్ప్రాజెక్టులతో పాటు పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీం కూడా పూర్తయ్యేదన్నారు.
కాల్వ తవ్వితే చాలు నీళ్లొస్తయ్: నైనాల గోవర్ధన్
చెన్నూరు ఎత్తిపోతల చేపట్టడానికి బదులుగా గ్రావిటీతోనే నీళ్లు తీసుకోవచ్చని టోపోషీట్ల ద్వారా తెలంగాణ జలసాధన సమితి నాయకుడు నైనాల గోవర్ధన్ వివరించారు. ఎస్సారెస్పీ ఉత్తర కాలువ(మందాకిని)కు ఎన్టీఆర్సీఎంగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారని, ఆ కాల్వ తవ్వి ఉంటే చెన్నూరుకు గ్రావిటీతో నీళ్లు వచ్చేవన్నారు. కుప్టి, ఎల్లంపల్లి, తుమ్మిడిహెట్టితో పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లిచ్చే అవకాశమున్నా రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు చేసి మూడు లిఫ్టులు ఎవరి కోసం నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ప్రారంభించిన గూడెం లిఫ్ట్స్కీం 55 సార్లు ఫెయిల్అయ్యిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో వంద వరకు లిఫ్టులున్నా అవన్నీ ఫెయిల్అయ్యాయని తెలిపారు.
కేసీఆర్ దోపిడీని అడ్డుకోవాలె: జస్టిస్ చంద్రకుమార్
ప్రాణహిత- చేవెళ్లను రూ.18 వేల కోట్లతో ప్రతిపాదిస్తే కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన అప్పటి వ్యాప్కోస్ ఎండీ ఇంటిపై సీబీఐ దాడి చేస్తే భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరికాయని, కేసీఆర్ వ్యవస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తారో ఇది రుజువు చేస్తుందన్నారు. కేసీఆర్ దోపిడీని అడ్డుకోకపోతే తెలంగాణ అస్థిపంజరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
లిఫ్ట్ స్కీంలన్నీ ఫెయిలవుతున్నయ్..
తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు తవ్విన ప్రాణహిత –చేవెళ్ల కాల్వను రిజర్వాయర్గా మార్చితే 5 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని, తుమ్మిడిహెట్టి పూర్తి చేస్తే మంచిర్యాల, ఆసిఫాబాద్జిల్లాలకు నీళ్లు వస్తాయని రిటైర్డ్ ఇంజనీర్విఠల్రావు తెలిపారు. కాళేశ్వరం రీడిజైనింగ్తో ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో 2 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందకుండా పోయిందన్నారు. చెన్నూరుకు గ్రావిటీతోనే నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్కు లేఖ రాస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి తెలిపారు. లిఫ్ట్ స్కీంలన్నీ ఎలక్ట్రో మెకానికల్యంత్రాల సమస్యలు, పైపులతో విఫలమవుతున్నాయని, ఇకనైనా వాటికి స్వస్తి పలికి గ్రావిటీ ప్రాజెక్టులే చేపట్టాలని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రొఫెసర్ వినాయక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్ వెంకట రమణ, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పశ్య పద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, కొండేటి సత్యనారాయణ, మన్నారం నాగరాజు, శ్రీనివాస్ యాదవ్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.