- తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. పరిస్థితి విషమం
- బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ ఘర్షణలు
ఢాకా: ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి ఉస్మాన్ హాదీ (షరీఫ్ ఒస్మాన్ హాదీ) హత్యతో చెలరేగిన సంఘర్షణ సద్దుమణగకముందే బంగ్లాదేశ్లో మరో స్టూడెంట్ నేతపై హత్యాయత్నం జరిగింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత మోతాలెబ్ సిక్దార్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపుతున్నది. సోమవారం ఉదయం ఖుల్నా పట్టణంలోని సిక్దార్ ఇంటివద్దే అతడిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఫైరింగ్ జరిపారు. ఈ ఘటనలో సిక్దార్ తల్లోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఎడమవైపు తీవ్ర గాయమైంది. దీంతో అతడిని పార్టీ కార్యకర్తలు దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సిక్దార్ ఎన్సీపీ లేబర్ వింగ్ (జాతీయ శ్రామిక్ శక్తి)కు సెంట్రల్ ఆర్గనైజర్, ఖుల్నా డివిజనల్ కన్వీనర్. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు నేషనల్ సిటిజన్ పార్టీ సిద్ధమవుతున్న సమయంలో క్రియాశీలక నేత అయిన సిక్దార్పై దాడి జరగడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై అక్కడి పోలీస్ అధికారి మాట్లాడుతూ ‘‘సిక్దార్పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ
వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు’’ అని తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
కొనసాగుతున్న నిరసనలు
గత వారం రాడికల్ నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. హాదీ మద్దతుదారులు, విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్కు, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీలీగ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. దైవదూషణ చేశాడనే నెపంతో ఓ హిందూ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. హింసాత్మక నిరసనలు, హిందూ మైనారిటీలపై దాడులు నమోదయ్యాయి. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్కు విద్యార్థుల నేతృత్వంలోని ఎన్సీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు పెంచుతూ భారత్ నుంచి దూరమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత మోతాలెబ్ సిక్దార్పై హత్యాయత్నం ఆందోళన కలిగిస్తున్నది.
భారత్–బంగ్లా మధ్య క్షీణిస్తున్న దౌత్య సంబంధాలు
భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఢిల్లీలోని తమ హైకమిషన్ వద్ద దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నట్లు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ప్రకటించింది. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని గుంపుగా కలిసి కొట్టి చంపడాన్ని నిరసిస్తూ, శనివారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల 20-–25 మంది యువకులు ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో తమ దౌత్య కార్యాలయ సిబ్బందిని తగ్గించుకునే అంశాన్ని పరిశీలిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేన్ హెచ్చరించారు. అయితే, కేవలం 20-25 మంది యువకులే శాంతియుతంగా నిరసన తెలిపారని, దీనిని భద్రతా సమస్యగా చిత్రీకరించడం తప్పుదోవపట్టించడమే’’ అని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది.
