హైదరాబాద్ : ఆన్ లైన్ మోసగాళ్లు చివరకి లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. లాక్ డౌన్ క్రమంలో లిక్కర్ అమ్మకాలు నిలిపివేయడంతో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్ కేటుగాళ్ళు మోసం చేస్తున్నారు.హైదరాబాద్ లోని ఫేమస్ బగ్గా వైన్స్ పేరుతో.. క్యూ ఆర్ కోడ్ పంపించి.. దానికి అమౌంట్ పంపిస్తే అర్ధగంటలో మందు మీ ఇంటికి పంపిస్తామంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు మోసగాళ్ళు.
ఈ మెసేజ్ ను నమ్మిన హైదరాబాద్, గౌలిపురాకి చెందిన రాహుల్ అనే బాధితుడు ఆన్ లైన్ లో 51 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. మద్యం ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
అయితే.. బగ్గా వైన్స్ పేరుతో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలంటూ మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. అయిదు రోజుల క్రితమే బగ్గా వైన్స్ యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిందని తెలిపారు పోలీసులు.