- 15 నుంచి 20 నియోజకవర్గాల్లో సమన్వయ లోపం
- సీరియస్ అయిన సీఎం రేవంత్రెడ్డి
- పరిషత్ ఎన్నికల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
- పంచాయతీ ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్,పార్టీ ఇన్చార్జి మీనాక్షితో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకుంటారని ఆశించామని.. కానీ, రెబల్స్ వల్ల కొన్ని తగ్గాయని సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సర్పంచ్స్థానాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంపై ఆయన సీరియస్అయ్యారు. 15 నుంచి 20 నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల వల్ల కాంగ్రెస్కు నష్టం జరిగిందన్నారు.
ముఖ్యంగా పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు, నలుగురు పోటీపడ్డారని.. రెబల్స్తో నామినేషన్లు విత్డ్రా చేయించడంలో పలువురు ఎమ్మెల్యేలు, పలువురు డీసీసీ చీఫ్లు విఫలమయ్యారని.. ఫలితంగానే ‘90శాతం లక్ష్యం’ చేరుకోలేకపోయామని అసహనం వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై శుక్ర, శనివారాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమీక్షించారు. నియోజకవర్గాలవారీగా ఆయా పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్ల వివరాలు తెప్పించుకొని విశ్లేషించారు.
ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన చోట్ల కాంగ్రెస్కు ఆశించిన స్థాయిలో సర్పంచ్స్థానాలు రాలేదని గుర్తించారు. అదే సమయంలో కొన్ని చోట్ల కాంగ్రెస్ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ సర్పంచ్స్థానాలు తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు ముగ్గురు పోటీ చేసిన చోట్ల నష్టం జరిగిందని.. రెబల్స్ను పోటీలో లేకుండా చూడడంలో అక్కడి ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్లు విఫలం చెందినట్లు తేలిందన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేశ్ ఫోన్
తక్కువ పంచాయతీలను గెలుచుకున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎందుకిలా జరిగిందో ఆరా తీశారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరిషత్ ఎన్నికల నాటికి గ్రూపుల సమస్య పరిష్కరించుకోవాలని, ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు.
