న్యూఢిల్లీ: గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనే వైదొలిగిన ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వచ్చే నెలలో మొదలయ్యే టీ20 వరల్డ్కప్నకు దూరం అవుతున్నాడు. మోకాలి గాయానికి సర్జరీ అవసరమైన నేపథ్యంలో అతను కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ‘జడేజా మోకాలుకు తీవ్రమైన గాయం అయింది. దీనికి మేజర్ సర్జరీ అవసరం. తొందర్లోనే అతను సర్జరీ చేయించుకుంటాడు. కాబట్టి కొంతకాలం అతను ఆటకు దూరంగా ఉంటాడు. జడేజాను పరీక్షించిన ఎన్సీఏ మెడికల్ టీమ్ అతను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎప్పుడు తిరిగొస్తాడో అంచనా వేయలేకపోయింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
జడ్డూ చాన్నాళ్ల నుంచి మోకాలు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా అతని ఆటను పరిశీలిస్తే అతను క్రమంగా బ్యాటింగ్ ఆల్రౌండర్గా మారుతున్నాడు. బౌలింగ్కు సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు కుడి మోకాలిపై భారం పడటమే ఇందుకు కారణం అనిపిస్తోంది. అయితే, జడేజా వరల్డ్కప్కు దూరం అయ్యాడని ఇప్పుడే చెప్పలేనని కోచ్ ద్రవిడ్ అన్నాడు. మెగా టోర్నీకి మరో ఎనిమిది వారాల సమయం ఉన్నందున ఆలోపు అతను కోలుకుంటాడేమో చూడాలన్నాడు.