
పద్మారావునగర్, వెలుగు: నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ఈనెల 11 నుంచి నిలిపివేసిన ఎలక్టివ్ కేసుల అడ్మిషన్లను శుక్రవారం నుంచి రీస్టోర్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి పూర్తిస్థాయిలో కొవిడ్, నాన్కొవిడ్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాజారావు మీడియాతో మాట్లాడారు. కరోనా స్పీడ్గా వ్యాపిస్తున్నప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత సీరియస్ కేసులు లేవన్నారు. అందుకే కరోనా పేషెంట్ల అడ్మిషన్లు పెరగడం లేదని తెలిపారు. కరోనా పేషెంట్లు వారం రోజులపాటు హోం ఐసోలేషన్లో ఉండి, మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుందన్నారు. సర్కారు ఆదేశాలతో శుక్రవారం నుంచి గాంధీలో అన్నిరకాల వైద్య సేవలను అందుబాటులో తెస్తున్నామని తెలిపారు. గురువారం సాయంత్రం వరకు బ్లాక్ఫంగస్, గర్భిణులు, చిన్నారులు సహా మొత్తం 145 మంది కరోనా పేషెంట్లు గాంధీలో చికిత్స తీసుకుంటున్నారన్నారు.