- శిక్షణ కేంద్రంతో నిరుద్యోగుల్లో నైపుణ్యాల పెంపు
- 180 మందికి స్కిల్ ట్రెయినింగ్ పూర్తి
- 77 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన
- ములుగు శ్రీయ ఇన్ఫోటెక్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న ఎనిమిది మంది
ములుగు, వెలుగు : ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే ములుగు జిల్లా కేంద్రంలో టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి) శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్కిల్ డెవెలప్మెంట్తో పాటు జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తోంది.
అంతేకాకుండా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఇక్కడే ఐటీ సెంటర్ ఏర్పాటు కావడంతో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఐటీ కంపెనీ ఎంతో ఉపయోగపడుతోందని, నిరుద్యోగుల ఇండ్లల్లో టాస్క్ వెలుగులు నింపుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాస్క్ ద్వారా 180 మందికి శిక్షణ..
టాస్క్ సెంటర్లలో నైపుణ్య శిక్షణ ఇస్తూ మూడు విభాగాల్లో ఎంచుకున్న కోర్సులను బట్టి ట్రెయినింగ్ ఇన్నారు. ఈ ఏడాది జనవరి 25న ములుగులోని బండారుపల్లి రోడ్డులోని పాత బీసీ హాస్టల్ భవనంలో టాస్క్ సెంటర్ను ప్రారంభించారు. అప్పటి నుంచి 6 బ్యాచ్లకు, ఒక్కో బ్యాచ్ లో 30మంది చొప్పున మొత్తం 180 మందికి శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా టెక్నికల్, నాన్ టెక్నికల్, పోటీ పరీక్షల నిమిత్తం ట్రెయినింగ్ ఇస్తున్నారు.
టెక్నికల్ విభాగంలో సీ, సీ ప్లస్ ప్లస్, జావా, డీసీఎంఎస్, పైథాన్, ఒరాకిల్, టాలీ, ఆటోక్యాడ్, నాన్టెక్నికల్ విభాగంలో కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవెలప్మెంట్, రెస్యూం బిల్డింగ్, కాంపిటేటివ్ విభాగంలో జనరల్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, జీకే, కరెంట్ అఫైర్స్ తదితర స్కిల్స్నేర్పిస్తున్నారు. టాస్క్ సెంటర్ లో జిల్లాకు చెందిన 180 మందికి స్కిల్ డెవెలప్మెంట్ ట్రెయినింగ్ ఇవ్వగా 77 మంది ఉపాధి పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.
మొదటి నాలుగు బ్యాచ్లకు సంబంధించి జూన్19న జాబ్ మేళా నిర్వహించగా, అందులో వివిధ కంపెనీల ఆఫర్లతో 57 మంది ప్రైవేటు కంపెనీల్లో వారి నైపుణ్యాలను బట్టి జాబ్ లు పొందారు. 5వ బ్యాచ్కి సంబంధించి ములుగులో ఏర్పాటు చేసిన శ్రీయ ఇన్ఫోటెక్ కంపెనీలో ఎనిమిది మంది ఉపాధి పొందారు. అందులో కొందరికి రూ.1.80లక్షల ప్యాకేజీతో విధులు నిర్వర్తిస్తున్నారు. 6వ బ్యాచ్ ఇటీవలే పూర్తి కాగా, వారికి కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో డిసెంబర్ 1న సైతం టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీలో అనలిస్ట్, కంటెంట్మాడరేటర్ జాబ్స్కోసం మేళా నిర్వహించారు. 12 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ ఐటీ కంపెనీని త్వరలో ప్రారంభం కానున్నది.
ములుగులో ఐటీ కంపెనీ..
ములుగులో శ్రీయ ఐటీ స్టార్టప్ కంపెనీ ఏర్పాటైంది. అందులో ఇప్పటికే పలువురు ఇంటర్న్ షిప్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎనిమిది మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ శ్రీయ ఇన్ఫోటెక్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
కంపెనీకి వచ్చే ప్రాజెక్టులను బట్టి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. టాస్క్ సెంటర్ వెనకాలే కొత్త ఐటీ కంపెనీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై తదితర ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీలు ములుగులో కూడా ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం అవుతోంది.
ఇన్ఫోసిస్ లో జాబ్..
ములుగు టాస్క్ సెంటర్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్, పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నాను. ట్రెయినింగ్ అనంతరం జాబ్ మేళాలో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం టాస్క్ ద్వారా ఎలాంటి శిక్షణ పొందాలి, ఏ ఉద్యోగానికి ఏవిధంగా ఇంటర్వ్యూకు అటెండ్ కావాలో తెలపడం ద్వారా పలువురు ఉద్యోగాలు పొందుతున్నారు. - కందాల భావన, ఇన్ఫోసిస్ ఉద్యోగిని
నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం
జనవరి 25న ములుగు టాస్క్ కేంద్రం ఏర్పాటు చేశాం. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ కేంద్రం నిర్వహిస్తున్నాం. 180 మందికి శిక్షణ పూర్తయింది. అందులో 77 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించిన జాబ్ మేళాలో 12మంది ఎంపికయ్యారు. కొర్ర మురళీ కృష్ణ, టాస్క్ మేనేజర్, ములుగు
