గోదావరి మిగులు జలాలన్నీ మావే

గోదావరి మిగులు జలాలన్నీ మావే

ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌లో మరోసారి ఏపీ వాదన

అవసరాలు తీరాకే కావేరికి మళ్లించాలని డిమాండ్‌

గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టును పోలవరం నుంచి చేపట్టాలని సూచన

హైదరాబాద్‌, వెలుగు: గోదావరిలో మిగులు జలాలన్నీ తమకే దక్కుతాయని ఏపీ మరోసారి వాదించింది. దిగువ రాష్ట్రంగా గోదావరి మిగులు జలాల్లో తమకు మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి వాదనే చేసిన ఏపీ.. ఇప్పుడు మరోసారి నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) మీటింగ్ లోనూ అదే విషయం చెప్పింది. గోదావరి మిగులు జలాలపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను అడ్డుకోవాలనే వైఖరిని ఏపీ కనబరుస్తూ వస్తోంది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరి లింక్‌ ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రశ్నించింది. తెలంగాణ సైతం గోదావరిలో మిగులు జలాలు లేవని, తమ రాష్ట్రం అసవరాలు తీరిన తర్వాతే లింక్‌ ప్రాజెక్టును చేపట్టాలని కోరింది. గోదావరి, – కృష్ణా, – పెన్నా, – కావేరి నదుల అనుసంధానంపై సోమవారం ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ఇంజనీర్లు పాల్గొన్నారు. మూడు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ, ఏపీ ప్రతినిధులు గోదావరిలో మిగులు జలాలే లేవంటూ వాదించగా అదే విషయాన్ని రాతపూర్వకంగా చెప్పాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ సూచించారు.

అసలు మిగులు జలాలే లేవ్: ఏపీ

గోదావరిలో 75 శాతం డిపెండబులిటీని లెక్కలోకి తీసుకుంటే అసలు మిగులు జలాలే లేవని ఏపీ ఇంజనీర్లు వాదించారు. ఒకవేళ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్నా అవి దిగువ రాష్ట్రంగా తమకు మాత్రమే చెందుతాయని తెలిపారు. తమ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, ముందు తమ రాష్ట్ర అవసరాలు తీర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం గోదావరి –- కావేరి అనుసంధానం చేపట్టాలని అనుకుంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ద్వారా కావేరికి తరలించే అలైన్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

మహానది నుంచి అయితే ఓకే: తెలంగాణ

మహానది నుంచి మొదట గోదావరి లింక్‌ ప్రాజెక్టు చేపట్టి అలా మళ్లించే నీటిని కావేరికి తరలిస్తే తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు లేనందున కావేరి లింక్‌ ప్రాజెక్టుకు ఇంతకుమించిన ప్రత్యామ్నాయం ఇంకోటి లేదన్నారు. తమ రాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే కేంద్రం ఏకపక్షంగా డీపీఆర్‌ తయారీకి పూనుకుందని అన్నారు. మహానది నుంచి నీటిని తరలించాలన్న తెలంగాణ ప్రతిపాదనను చత్తీస్‌గఢ్‌ ఇంజనీర్లు వ్యతిరేకించారు.

అలైన్‌మెంట్లు ఇవే..

గోదావరి (ఇచ్చంపల్లి), – కృష్ణా (నాగార్జునసాగర్‌) ,- పెన్నా (సోమశిల),- కావేరి (గ్రాండ్‌ ఆనికట్‌)

  గోదావరి (ఆకినపల్లి), – కృష్ణా (నాగార్జునసాగర్‌), – పెన్నా (సోమశిల), – కావేరి (గ్రాండ్‌ ఆనికట్‌)

  గోదావరి (జానంపేట), – కృష్ణా (నాగార్జునసాగర్‌), – పెన్నా (సోమశిల),  -కావేరి (గ్రాండ్‌ ఆనికట్‌)

ఈ మూడు అలైన్‌మెంట్లలో ఏదో ఒక చోటు నుంచి 247 టీఎంసీల గోదావరి నీళ్లను ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి, ఆకినపల్లి నుంచి లింక్‌ ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు 66, ఏపీకి 81, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. జానంపేట నుంచి లింక్‌ ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు 39, ఏపీకి 108, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు.