ఆ నలుగురిలో నేను లేను 

ఆ నలుగురిలో నేను లేను 

ఇటీవల టాలీవుడ్‌‌లో  జరుగుతున్న పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్ లో ఆయన మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ మొత్తం ఆ నలుగురు చేతుల్లోనే ఉందని, రెండు రోజులుగా ‘ఆ నలుగురు’ అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి.  ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. నేను ఆ నలుగురిలో లేను. గత పదిహేను సంవత్సరాల క్రితం ఆ నలుగురు అనే మాట స్టార్ట్ అయ్యింది.  ఆ నలుగురు తర్వాత  పది మంది అయ్యారు.  అది ఎవరూ పట్టించుకోవడం లేదు.

పదిమంది దగ్గర ప్రస్తుతం థియేటర్‌‌లు ఉన్నాయి. ఆ నలుగురు వ్యాపారం నుంచి నేను కొవిడ్‌‌ సమయంలోనే బయటికి వచ్చేశాను.  తెలంగాణలో నాకు ఒక్క థియేటర్‌‌ కూడా లేదు.  ఏఏఏ  ఏషియన్‌‌ థియేటర్‌‌ మాత్రమే ఉంది. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌‌లో  పదిహేను వందలు థియేటర్స్‌‌ ఉంటే  మా దగ్గర కేవలం పదిహేను మాత్రమే ఉన్నాయి. ఈ థియేటర్‌‌లు కూడా లీజు రెన్యూవల్‌‌ గడువు ముగిసిన తరువాత లీజు కంటిన్యూ చేయడం లేదు. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫోటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు.

 నేను వాళ్లలో  లేను.. వారితో వ్యాపారంలో లేను.  జూన్‌‌1  నుంచి థియేటర్స్‌‌ మూసివేస్తాం అనే అంశంపై ఏపీ  సినిమాటోగ్రఫీ మినిస్టర్‌‌ రియాక్ట్ అయిన విధానం  సమంజసంగా ఉంది. నేను ఈ థియేటర్స్‌‌ అంశానికి సంబంధించిన ఏ మీటింగ్‌‌లో పాల్గొనలేదు. నేను కావాలని, ఇష్టం లేక వెళ్లలేదు. కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. పవన్‌‌ కళ్యాణ్‌‌ గారి సినిమా విడుదల సమయంలో థియేటర్స్‌‌  మూసి వేస్తామని చెప్పడం దుస్సాహసం.

మన ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లిన కాదనకుండా హెల్ప్‌‌ చేస్తున్న మంచి మనస్సున  వ్యక్తి పవన్‌‌ కళ్యాణ్ గారు.  గతంలో ఆయన్ని కలిసినప్పుడు చాంబర్ తరపున సీఎం చంద్రబాబు గారిని కలవండి అని చెప్పారు. కానీ ఎవరూ వెళ్లలేదు. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ప్రశ్నలు సబబుగానే ఉన్నాయి.  నిజంగానే సింగిల్‌‌ స్క్రీన్‌‌ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప ఇలా థియేటర్స్ మూసి వేస్తున్నామని చెప్పడం సరికాదు. అలాగే నాకు క్యూబ్‌‌ కంపెనీలో కూడా ఎలాంటి  వాటా లేదు’ అని అన్నారు.