
సత్తా లేకపోతే ఏ సినిమా ఆడదని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. ఎనర్జిటిక్ హీరో నిఖిల్ కథానాయకుడిగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కార్తికేయ 2’. ఈ మూవీ విడుదలైన రోజు నుండి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మాదాపూర్ లో ఏర్పాటు చేసిన మూవీ సక్సెస్ మీట్ కు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్తికేయ 2 గురించి ఎంత చెప్పినా సరిపోదన్న ఆయన.. హిందీలో 50 థియేటర్ లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఇప్పుడు 700 థియేటర్ లలో నడుస్తుందని అన్నారు . సత్తా లేకపోతే ఏ సినిమా ఆడదని.. ఆ సత్తా కార్తికేయ 2కు ఉంది కనుకే బాలీవుడ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోందని అభిప్రాయపడ్డారు.
అఖండ సినిమా చూశాక.. విష్ణుతత్వంపై మూవీ వస్తుంది అని ఊహించా అని అల్లు అరవింద్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వెంచర్ ఫిల్మ్ కి పౌరాణికం జోడించి తీయడం అంత ఈజీ కాదన్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే ఎంతో ఆలోచించి ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ భయాందోళనల్లో ఉందని, సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా లేదా అనే సందేహం కలుగుతోందని చెప్పారు. కానీ ఈ మధ్య వచ్చిన 3 సినిమాలతో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎంత దూరమైనా వస్తారని అర్థం అయిందని అన్నారు. ఇక నిఖిల్ తో తమ సంస్థలో ఒక సినిమా చేస్తున్నామని.. అందులో అనుపమ హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నామని అల్లు అరవింద్ చెప్పారు.