
హైదరాబాద్ లోని హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ,రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 2024 పుష్ప 2కి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం స్టేజ్ పైన మాట్లాడిన అల్లు అర్జున్.. సీఎం రేవంత్ పర్మిషన్ తీసుకుని.. పుష్ప2 డైలాగ్ చెప్పాడు. ‘నా బిడ్డ మీద ఒక్క గీత పడినా.. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు ఒక్కొడి తల రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే’ డైలాగ్ చెప్పడం హైలెట్ గా మారింది.
హీరోలు అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, సీనియర్ హీరోయిన్స్ సుహాసినీ, జయసుధ, సింగర్ సునీత, దర్శకులు రాజమౌళి, సుకుమార్, మురళీ మోహన్, కీరవాణి, సింగర్ రేవంత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుక ప్రారంభమైన కొద్ది సేపటికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ హాగ్ చేసుకోవడం ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తమన్ మ్యూజిక్ షో, స్పెషల్ డాన్స్లు ఆకట్టుకున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 10 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించింది.2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలకు, నటులు, దర్శకులు, టెక్నిషియన్లకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే..