భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ చిరంజీవికి ఆహ్వానం

భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ  చిరంజీవికి ఆహ్వానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూలై 04వ తేదీన ఏపీలోని భీమవరానికి వెళ్లనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా మోడీ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మోడీ పాల్గొనే ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ టాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. జూలై 03న హైదరాబాద్ లో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి జూలై 04న ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్ లో 10.50కు భీమవరంకు చేరుకుంటారు. అక్కడ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం విజయవాడకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.