నగరం కాదిది ట్రాఫిక్​ నరకం!

నగరం కాదిది ట్రాఫిక్​ నరకం!
  • నగరం కాదిది ట్రాఫిక్​ నరకం!
  • హైదరాబాద్​లో రోడ్డెక్కితే గమ్యం చేరుడు మన చేతుల్లో లేదు
  • రాష్ట్రంలో కోటిన్నర దాటిన వెహికల్స్​
  • అందులో 70 శాతం రాజధాని రోడ్లపైనే
  • వాహనాలు  పెరుగుతున్నా రోడ్ల విస్తరణ జరగట్లే
  • మెట్రో, ఫ్లై ఓవర్లు వచ్చినా నగరవాసికి తప్పని ట్రాఫిక్​ కష్టాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హైదరాబాద్​.. అవకాశాల స్వర్గధామం.. దేశ నలుమూలల నుంచి విద్య, వైద్యం, ఉపాధిని వెతుక్కుంటూ వచ్చే జనాలకు గమ్యస్థానం. కాలంతో పాటే ఈ కాస్మోపాలిటన్​ సిటీ శరవేగంగా విస్తరిస్తున్నది. కోటి దాటిన జనాభాతో పాటే వాహనాల సంఖ్యా కోటికి చేరింది. ఇవి చాలదన్నట్లు ప్రతిరోజూ కొత్తగా 1200 వెహికిల్స్ రోడ్లెక్కుతున్నాయి. కానీ పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్లను విస్తరించడంలో  రాష్ట్ర సర్కారు ఫెయిల్​ అవుతున్నది.

ఫలితంగా హైదరాబాద్  నగరం నరకానికి నకలుగా మారింది. మెట్రో, ఫ్లై ఓవర్లు వచ్చినా సగటు నగరవాసికి ట్రాఫిక్​  కష్టాలు తప్పడం లేదు. రోడ్డెక్కితే ఎప్పటికి గమ్యం చేరుతామో అంతుచిక్కట్లేదు. రోడ్డెక్కిన ప్రతీసారి మోటారిస్టులు అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్  హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్  సమస్య మరింత తీవ్రం కానుండడం ఆందోళన కలిగించే అంశం.

70 శాతం వెహికల్స్ హైదరాబాద్​లోనే..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  జనాభా కోటి దాటిపోయింది.  ప్రతి ఇంట్లో కారు, బైక్  తప్పనిసరి అయింది.  జీహెచ్ఎంసీ  పరిధిలో మొత్తం తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో1,500 కిలోమీటర్ల మెయిన్  రోడ్లు ఉన్నాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,54,77,512 వాహనాలు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కాగా.. వాటిలో దాదాపు 7‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0  శాతం  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రిజిస్టర్  అయ్యాయి.  ఇందులో గ్రేటర్  రోడ్లపై రోజూ దాదాపు 30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి.  ఒక్క హైదరాబాద్  కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోనే  రోజూ 15 లక్షలకు పైగా వెహికల్స్  ట్రావెల్ 
 చేస్తున్నాయి. 

ALSO READ: యువత ఓట్లే కీలకం

సరైన పబ్లిక్  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ లేక అవస్థలు 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను వెంటాడుతున్న సమస్యల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌  అతిపెద్ద సమస్య. ఆర్టీసీ బస్సులు, క్యాబ్ లు, వ్యక్తిగత వాహనాలు ఇలా ఏ వెహికల్‌‌‌‌‌‌‌‌లోనైనా సరే సిటీలో ట్రావెల్  చేయాలంటే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో  నరకం చూడాల్సిందే. జనాభాకు అనుగుణంగా పబ్లిక్  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్  వ్యవస్థ లేకపోవడంతో జనం సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.  ఈ క్రమంలోనే కార్లు, బైకుల సంఖ్య బాగా పెరిగిపోయింది.  దీంతో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌  సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌  నియంత్రణ కోసం మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకుండాపోతున్నది.

దారుణంగా రోడ్లు..

కరోనా తర్వాత  సొంత వాహనాల వాడకం ఎక్కువ కావడంతో సిటీలో ట్రాఫిక్  సమస్య మరింత తీవ్రమైంది.  దీనికితోడు ఫ్లై ఓవర్లు, వాటర్  పైప్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌, డ్రైనేజీ నిర్మాణం కోసం జరుగుతున్న తవ్వకాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రోడ్లపై అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతున్నది.