
బ్రిస్బేన్: స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బాల్స్లో 23 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 నాటౌట్) మెరుపు సెంచరీతో విజృంభించడంతో ఇండియా–ఎతో మూడో, చివరి వన్డేలో ఆస్ట్రేలియా–ఎ ఘన విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన ఆసీస్ ఆదివారం జరిగిన ఈ పోరులో 9 వికెట్ల తేడాతో గెలిచి ఊరట దక్కించుకోగా.. ఇండియా 2–1తో సిరీస్ను ముగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియా నిర్ణీత 47.4 ఓవర్లలో 216 రన్స్కే ఆలౌటైంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (52) ఫిఫ్టీతో రాణించగా, వికెట్ కీపర్ యస్తికా భాటియా (42) సత్తా చాటింది. షెఫాలీ, నందిని (28) తొలి వికెట్కు 86 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చినా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ఇండియా డీలా పడింది.
తేజల్ (1), రాఘవి బిస్త్ (18), తనుశ్రీ (17), కెప్టెన్ రాధా యాదవ్ (18), మిన్ను మణి (5), తనుజ కన్వార్ (15) నిరాశ పరిచారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ తాలియా మెక్గ్రాత్ (3/40) మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. సైనా జింగర్ (2/50), ఎలా హేవార్డ్ (2/43), అనికా లియోరాడ్ (2/16) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్లో హీలీ మెరుపు ఇన్నింగ్స్తో ఆసీస్ 27.5 ఓవర్లలో 221/1 స్కోరు చేసి గెలిచింది. మరో ఓపెనర్ తాలియా విల్సన్ (59)తో తొలి వికెట్కు 137 రన్స్ జోడించిన అలీసా 64 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన ఆమె ఈ మ్యాచ్లో తన మునుపటి ఫామ్ను చూపించింది. హీలీ 7, 49 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్లను ఇండియా ఫీల్డర్లు డ్రాప్ చేశారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీలీ జట్టుకు భారీ విజయం అందించింది.