
సందీప్ రెడ్డి వంగా, అట్లీ లాంటి సౌతిండియన్ డైరెక్టర్స్ బాలీవుడ్లోనూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మరో తమిళ దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో ‘అమరన్’ లాంటి లవ్స్టోరీ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి.. త్వరలో ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటగా నటించబోతున్నట్టు సమాచారం. రియల్ లైఫ్ కపుల్ అయిన విక్కీ, కత్రినా కలిసి నటించబోయే మొదటి సినిమా ఇదే కానుంది.
ఇక గత నెలలో తన ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసిన కత్రినా.. ఈ నెలలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని బాలీవుడ్ టాక్. మరోవైపు ‘ఛావా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’లో నటిస్తున్నాడు. విక్కీ కౌశల్. ఈ రొమాంటిక్ డ్రామాలో రణబీర్ కపూర్, అలియా భట్తో కలిసి విక్కీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దీని తర్వాత పరశురాముడి కథతో ‘స్త్రీ’ డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కించే పౌరాణిక చిత్రం ‘మహావతార్’లో నటించాల్సి ఉంది. మరోవైపు రాజ్ కుమార్ పెరియసామి కూడా ప్రస్తుతం ధనుష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక విక్కీ కౌశల్, కత్రినా సినిమాపై దృష్టిసారించనున్నాడు.