
అమెరికాలోని అమెజాన్ గిడ్డంగి ఉద్యోగులు నిరసనకు దిగారు. మంగళవారం ( అమెరికా కాలమానం ప్రకారం ) నుండి 500మంది కార్మికులు నిరసనకు దిగుతున్నట్లు ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే కార్మికుల హక్కుల సంఘం తెలిపింది. కరోనా వ్యాప్తి చెందిన గిడ్డంగుల వద్ద సురక్షితమైన మాస్కులు అందించాలని, జీతంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అమెజాన్కు ఆదాయం తప్ప ఉద్యోగుల బాగోగులు పట్టవని అక్కడి ఉద్యోగులు తెలిపారు. కరోనా పాజిటీవ్ నమోదైన గిడ్డంగులను వెంటనే మూసివేసి రక్షణ చర్యలు చేపట్టాలని గిడ్డంగులను సానిటైజ్ చేయాలని కోరారు. నిరసన చేస్తున్న వారిని విధులనుంచి తొలగించవద్దని అన్నారు. తమకు తక్షణమే రెండు వారాల వేతనంతో పాటు సిక్ లీవ్స్ను మంజూరు చేయాలని కోరారు.
అమెరికాలోని అమెజాన్ గిడ్డంగుల్లో ఇప్పటివరకు 130కిపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంపై గతంలోనే స్పందించిన అమెజాన్ యాజమాన్యం… టెంపరేచర్ చెకింగ్, మాస్క్లు, శానిటైజర్లను కార్మికులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.