
హైదరాబాద్, వెలుగు : అన్నవరం దేవేందర్ రాసిన ‘అట్లనే’ కవితా సంపుటిని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి శుక్రవారం ఆవిష్కరించారు. ‘బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జీవగడ్డ మిత్రులు’ ఆధ్వర్యంలో చావడి వేదిక ద్వారా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ చక్రపాణి మాట్లాడుతూ తాము ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం జీవగడ్డ పత్రికేనన్నారు.
మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ దేవేందర్ తన కవిత్వంలో తెలంగాణ చరిత్రను లిఖించారని కొనియాడారు. సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ దేవేందర్ కవిత్వం తెలంగాణ నుడికారంలో అత్యంత సరళంగా ఉంటుందన్నారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎన్. రజని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎల్వీకే.రెడ్డి, ప్రముఖ కవి అందెశ్రీ, సంగిశెట్టి శ్రీనివాస్, గాజుల శ్యాంప్రసాద్లాల్, పొన్నం రవిచంద్ర, జ్వలిత పాల్గొన్నారు.