- ముగ్గురు నిందితులు అరెస్ట్
- 19 వాహనాలు స్వాధీనం
అంబర్పేట్, వెలుగు: చిరు వ్యాపారుల టీవీఎస్ఎక్సెల్వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మంగళవారం వెల్లడించారు. గత అక్టోబర్ 7న అంబర్పేట ప్రేమ్నగర్కు చెందిన గుల్ శెట్టి రాజశేఖర్ తన టీవీఎస్ ఎక్సెల్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. లాల్ దర్వాజ ఛత్రినాకకు చెందిన షకత్వారి శ్రవణ్ అల్లం, ఎల్లిగడ్డల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అఫ్టల్గంజ్, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత తన మొదటి భార్య పింకీకి విడాకులిచ్చి శాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఉప్పల్ బీరప్పగడ్డలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి బోడుప్పల్, అంబర్పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం చేస్తున్న బీబీనగర్కు చెందిన కాలియా రాజు, మేడ్చల్కు చెందిన షకత్ ముకేందర్లతో స్నేహం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్వేశారు. టీవీఎస్ఎక్సెల్వాహనాలైతే బాధితులు ఫిర్యాదు చేయరని,ఈజీగా చోరీ చేయవచ్చని అనుకున్నారు. అంబర్పేట్పోలీసే స్టేషన్ పరిధిలో ఒకటి, కాచిగూడలో ఒకటి, ఛత్రినాకలో ఒకటి, ఉప్పల్లో 9, నేరేడ్మెట్లో 2, శామీర్పేట 2, అల్వాల్ పీఎస్ పరిధిలో 1, కుషాయిగూడలో 2 వాహనాలను దొంగిలించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్చేశారు.
