చండూరు రెవెన్యూ డివిజన్​పై సందిగ్ధత

చండూరు రెవెన్యూ డివిజన్​పై సందిగ్ధత
  • రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సందిగ్ధం
  • ఇప్పటికే రెండుసార్లు మునుగోడులో పర్యటించిన కేటీఆర్​
  • చండూరు గురించి ప్రస్తావన రాకపోవడంతో అయోమయం

నల్గొండ, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చండూరు రెవెన్యూ డివిజన్​పై సందిగ్ధత నెలకొంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా చండూరు డివిజన్​ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్​ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి డిసెంబర్​లో మునుగోడులో కేటీఆర్​ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రుల బృందం సమీక్ష చేసి రూ.400 కోట్లు ప్రకటించింది. కానీ చండూరు డివిజన్​ గురించి మాత్రం ప్రస్తావించలేదు. మళ్లీ ఇటీవల చండూరు, గట్టుప్పుల్​ మండలాల్లో కేటీఆర్​పర్యటన సాగింది. డిసెంబర్​లో హామీ ఇచ్చిన అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్​రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంకా మిగిలిపోయిన హామీలు ఏమైనా ఉంటే నెరవేరుస్తామని ఇదే సభలో కేటీఆర్​ స్పష్టం చేశారు. కానీ చండూరు డివిజన్​ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదు. మర్రిగూడ, చౌటుప్పుల్​లో పర్య టించిన ఆరోగ్య మంత్రి హరీశ్​రావు కూడా చండూరు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో చండూరులో వందపడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మాత్రం చెప్పారు. పురపాలక శాఖ మంత్రి హోదాలో మంత్రి కేటీఆర్​ రెండుసార్లు పర్యటించినప్పటికీ చండూరు గురించి ప్రస్తావించకపో వడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన కేటీఆర్​ పర్యటనలో చండూరు ప్రస్తావన కచ్చితంగా ఉండొచ్చని అధికారులు సైతం భావించారు. అందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రెవెన్యూ డివిజన్​ ఏర్పాటుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాంపల్లిలో ఏర్పాటుకు ప్రతిపాదన

చండూరు, మునుగోడు మండలాలు ఇప్పటికే నల్గొండ డివిజన్​ పరిధిలో ఉన్నందున కొత్త డివిజన్​ నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు తెలిపారు. పాత తాలూక కేంద్రమైన నాంపల్లిలోనే ప్రస్తుతం సివిల్, ఎక్సైజ్​సర్కిల్​పోలీస్​స్టేషన్లు, ఎస్టీఓ, విద్యుత్​ డీఈ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడే జూనియర్​సివిల్​జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో నాంపల్లి మండల కేంద్రాన్ని డివిజన్​ కేంద్రంగా మారిస్తే దేవరకొండ డివిజన్​తో ఇబ్బంది పడుతున్న గుర్రంపోడు మండలంతోపాటు, మర్రిగూడ, చండూరు మండలాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. చండూరు డివిజన్​ వల్ల నాంపల్లి మండలంలోని  ముష్టిపల్లి, దేవత్​పల్లి, రాజాతండా, రేక్యాతండా, రేవెల్లి, మునుగోడు మండలంలోని గూడాపూర్, కల్వలపల్లితోపాటు మరో రెండు, మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఈ గ్రామాలు నల్గొండ డివిజన్​కు సమీపంలో ఉన్నాయి. భౌగోళికంగా ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా డివిజన్​ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు. గట్టుప్పుల్​ మండల తరహాలో మరీ ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలనే డిమాండ్​ కూడా అధికార పార్టీ నేతల నుంచి  వినిపిస్తోంది. 

ఒకే నియోజకవర్గంలో రెండు ఎట్లా?

ఒకే నియోజకవర్గంలో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్​ నారాయణ్​పూర్, చౌటుప్పల్​మండలాలకు కలిపి యాదాద్రి జిల్లా పరిధిలో చౌటుప్పుల్​ రెవెన్యూ డివిజన్​ ఉంది. మర్రిగూడ, నాంపల్లి మండలాలు దేవరకొండ డివిజన్​ పరిధిలో ఉన్నాయి. మునుగోడు, చండూరు, గట్టుప్పుల్​ మండలాలు నల్గొండ డివిజన్​ పరిధిలో ఉన్నాయి. అయితే కొత్త డివిజన్​ ఏర్పాటు చేయాలనుకుంటే చండూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలా.. లేదంటే నాంపల్లి కేంద్రంగా చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చ జరుగుతోంది. ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.