దారి అడిగినందుకు దాడి చేశారు..102 వాహన డ్రైవర్ను చితకబాదిన పోకిరీలు

దారి అడిగినందుకు దాడి చేశారు..102 వాహన డ్రైవర్ను చితకబాదిన పోకిరీలు

ఎల్బీనగర్, వెలుగు: 102 వెహికల్‎కు ఓ ఇన్నోవా కారు అడ్డుగా వచ్చింది.. దారి ఇవ్వమని డ్రైవర్ అడిగితే ఆ కారులో ఉన్న ఇద్దరు యువకులు అతనిపై దాడి చేశారు. ట్రాఫిక్‎కు అంతరాయం కలిగించి హంగామా సృష్టించారు. వనస్థలిపురం ఇన్​స్పెక్టర్ మహేశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ గ్రామానికి చెందిన కొర్ని యాదయ్య 102 వాహన డ్రైవర్‎గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటలకు కోఠి మెటర్నటీ హాస్పిటల్​నుంచి ఓ బాలింతను రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామానికి తీసుకెళ్తున్నాడు. 

వాహనం వనస్థలిపురం బీఎన్​రెడ్డి నగర్​వద్దకు రాగానే.. ఇన్నోవా కారు అడ్డుగా వచ్చి ఆగింది. దారి ఇవ్వాలని యాదయ్య అడగడంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి, అతనిన కిందికి లాగి చితకబాదారు. అంబులెన్స్‎లో బాలింత ఉందని స్థానికులు, వాహనదారులు చెప్పినా వారు వినలేదు. డ్రైవర్ తమ కాళ్లు మొక్కితేనే వదిలేస్తామని అరగంటపాటు హంగామా చేశారు. ట్రాఫిక్‎లో అందరూ చూస్తుండగానే ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అక్కడున్నవారు వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్ట్ ​చేయడంతో వైరల్​అయింది. 

డ్రైవర్ యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకులను అరెస్ట్​చేశారు. నిందితులు నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన ముడావత్ ప్రశాంత్, అఖిల్‎గా గుర్తించామని, వీరు వనస్థలిపురంలో ఉంటున్నట్లు తెలిపారు. ప్రశాంత్ ఓ ప్రముఖ సాఫ్ట్​వేర్​కంపెనీలో టీం లీడర్‎గా చేస్తున్నాడని, అఖిల్ ఇంటర్ ఫెయిలై ఖాళీగా ఉంటున్నాడని చెప్పారు. ఇద్దరూ కారును రెంట్‎కు తీసుకొని మద్యం సేవించి, పోకిరి చేష్టలు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.