అమీన్ పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధి లోని ప్రాణసంకటంగా మారిన డంప్యార్డు

అమీన్ పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధి లోని ప్రాణసంకటంగా మారిన డంప్యార్డు
  •     దుర్వాసన, పొగతో అవస్థలు పడుతున్న ప్రజలు 

అమీన్​పూర్, వెలుగు: అమీన్​పూర్​ జీహెచ్ఎంసీ సర్కిల్​ పరిధిలోని డబుల్​ బెడ్​ రూమ్​ సమీపంలో ఉన్న డంప్​యార్డు ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. దీని నుంచి వచ్చే దుర్వాసనతో కాలనీ వాసులు ప్రశాంతత కోల్పోతున్నారు. డోర్లు మూసుకొని ఇంట్లో ఉన్నప్పటికీ వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డంప్​యార్డులో చెత్తకు మంటలు అంటుకుని దట్టమైన మంటలు, పొగ నివాసాలను కమ్మేస్తున్నాయి. దీంతో ఊపిరాడక అవస్థ పడుతున్నారు.  దాదాపు అమీన్​పూర్​ జీహెచ్ఎంసీ పరిధి నుంచి రోజుకు 150 టన్నుల చెత్తను డంప్​యార్డ్​కు తరలిస్తున్నారు. 

గత నవంబర్​తో రాంకీ సంస్థతో ఉన్న ఒప్పందం ముగియడంతో డంప్​ యార్డు నుంచి చెత్త తరలింపు నిలిచిపోయింది.  డిసెంబర్​ నుంచి చెత్త తరలింపు సజావుగా జరగకపోవడంతో డంప్​యార్డులో చెత్త కొండలా పేరుకుపోయింది.  అధికారులు తొలగింపు చర్యలు చేపట్టినా డంప్​యార్డుకు తరలించే చెత్త ఎక్కువగా ఉంటుంది. మరో వైపు నివాసాల మధ్య నుంచి డంప్​ యార్డును పూర్తిగా తొలగించాలని అమీన్​పూర్​ పీపుల్స్​ అసోసియేషన్​ డిమాండ్​చేస్తోంది. ఇటీవల సైబరాబాద్​ మున్సిపల్​ కమిషనర్​ సృజనను కలిసి డంప్​యార్డు తొలగించాలని వినతి పత్రాన్ని అందజేశారు.