- రూ. 2 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్న యూఎస్
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)కు అమెరికా గుడ్ బై చెప్పింది. ఆ సంస్థ నుంచి బయటకు వస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితమే ప్రకటించగా.. తాజాగా గురువారం (జనవరి 24) అధికారికంగా వైదొలగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని డబ్ల్యూహెచ్వో ఆఫీసుల్లో ఉన్న తమ సిబ్బందిని వెనక్కి పిలిపించామని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది.
కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో డబ్ల్యూహెచ్ వో ఫెయిల్ అయిందని.. సైంటిఫిక్గా ఆ సంస్థ తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించింది. డబ్ల్యూహెచ్వోకు చెందిన అన్ని కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా బయటకు వచ్చినట్టు తెలిపింది. అయితే, డబ్ల్యూహెచ్ వో నుంచి బయటకు వచ్చినప్పటికీ, ఆ సంస్థతో కలిసి కొంత పరిమితి మేరకు పనిచేస్తామని పేర్కొంది.
డబ్ల్యూహెచ్ వో నుంచి వైదొలగిన అమెరికా ఆ సంస్థకు సుమారు 260 మిలియన్ డాలర్లు (రూ. 2,389 కోట్లు) బకాయిలు చెల్లించాల్సి ఉందని ‘బ్లూమ్ బర్గ్’ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ వో అధికారులు స్పందిస్తూ.. సంస్థకు బకాయిలు చెల్లించేంత వరకూ అమెరికా ఉపసంహరణ అధికారికంగా పూర్తికాదన్నారు. అయితే, వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలన్న చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని అమెరికా అధికారులు చెప్తున్నారు. కాగా, అమెరికా వైదొలగడంతో ఆ సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
