కేంద్ర ఆదేశాలపై న్యాయసమీక్ష కోరిన ట్విట్టర్​

కేంద్ర ఆదేశాలపై న్యాయసమీక్ష కోరిన ట్విట్టర్​

కేంద్ర ప్రభుత్వం  ఇటీవల జారీ చేసిన పలు ఆదేశాలపై  ట్విట్టర్​ కోర్టుకెక్కింది. కర్ణాటక హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. కొన్ని రాజకీయ పార్టీలు పోస్ట్​ చేసే కంటెంట్​ను బ్లాక్​ చేయాలని కేంద్ర సర్కారు కోరుతోందని పిటిషన్​ లో ట్విట్టర్​ పేర్కొంది.  భారత సర్కారు సూచించిన విధంగా రాజకీయ పార్టీల కంటెంట్​ను ఏకపక్షంగా బ్లాక్​ చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు  విఘాతం కలిగించినట్లు అవుతుందని కోర్టుకు తెలిపింది.

అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్​ ను..

వాస్తవికంగానే అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్​ ను తమ ప్లాట్​ ఫామ్​ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని, ఈవిషయంలో సంబంధిత ప్రభుత్వ సంస్థలకు సహకారాన్ని కూడా అందించామని ట్విట్టర్​ కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకొని పనిచేయడానికి గ్రీవెన్స్​ అండ్​ కాంప్లయన్స్​ ఆఫీసర్ల నియామకాన్ని కూడా తప్పనిసరి చేశామని స్పష్టం చేసింది.  దేశ రాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున జరిగిన రైతు ఉద్యమం, కొవిడ్పై వందతులతో ముడిపడిన ట్విట్టర్​ ఖాతాలను, కంటెంట్​ ను బ్లాక్​ చేయాలని కేంద్రం తమకు నిర్దేశించిందని పిటిషన్​ లో ట్విట్టర్​ వివరించింది. ఈమేరకు కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై  న్యాయ సమీక్ష( జ్యుడీషియల్​ రివ్యూ) చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

సోషల్​ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందే : కేంద్ర ఐటీ మంత్రి

ట్విటర్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ​స్పందించారు. ‘‘సోషల్​ మీడియా వ్యాప్తి విస్తృతంగా జరుగుతోంది.  దాన్ని జవాబుదారీగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అది కట్టుబడి ఉండాల్సిందే. ఈక్రమంలో ఏవైనా చట్టపరమైన మార్పులు అవసరమైతే చేయడానికి సిద్ధమే. ఏ రంగంలోని కంపెనీ అయినా దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే” అని మంత్రి వ్యాఖ్యానించారు.  అభ్యంతరకరమైన ట్విట్టర్​ పోస్టులను, ఖాతాలను జులై 4కల్లా తొలగించాలంటూ ట్విట్టర్​కు కేంద్ర ఐటీశాఖ  నిర్దేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను జూన్​ 6, 9, 27 తేదీల్లో కేంద్రం పంపింది. వీటిపైనే ప్రస్తుతం ట్విట్టర్​ న్యాయ సమీక్షను కోరుతోంది.