బెంగుళూర్: ఆఫీస్లో లైట్లు బంద్ చేసే విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లైట్లు ఆపేయమన్న పాపానికి మేనేజర్ను దారుణంగా హత్య చేశాడు ఓ టెకీ. కారం చల్లి, డంబెల్తో కొట్టి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మేనేజర్ను చంపేశానని చెప్పి లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ ఘటన ఐటీ రాజధానిగా పేరొందిన బెంగుళూర్ నగరంలో జరిగింది.
వివరాల ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన భీమేష్ బాబు (41) గోవిందరాజనగర్ పోలీస్ పరిధిలోని డిజిటల్ డేటా స్టోర్లో మేనేజర్గా పని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన సోమల వంశీ (24) ఇదే కంపెనీలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నవంబర్ (2) అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఆఫీస్లో లైట్లు ఆర్పే విషయంలో భీమేష్ బాబు, వంశీ మధ్య వాగ్వాదం తలెత్తింది.
లైట్లు ఆపేయాలని భీమేష్ బాబు చెప్పగా.. అందుకు వంశీ నిరాకరించాడు. చిన్నగా మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన వంశీ మేనేజర్ భీమేష్పై దాడి చేశాడు. కారం పొడి చల్లి డంబెల్తో తల, ముఖం, ఛాతీపై కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన భీమేష్ను ఇతరు ఉద్యోగులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కానీ భీమేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడు వంశీ గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మేనేజర్ భీమేష్ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ మేరకు వంశీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆఫీసు లైట్ల విషయంలో చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసిందని డీసీపీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధృవీకరించారు.
