సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్ఐ సైదులుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. మైనర్ అయిన తన కూతుర్ని ఓ వ్యక్తి ప్రేమపేరుతో సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని అడివేముల గ్రామానికి చెందిన షేక్ రహీం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పీఎస్ కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్టేషన్ లో ఎస్ఐ సైదులు గాడ నిద్రలో ఉన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తమను ఎస్ఐ పట్టించుకోకపోవడమే గాకుండా వేధిస్తున్నారని చెబుతున్నారు బాధితులు. ఎస్ఐ నిద్రపోతున్న ఘటనను బాధితులు వీడియో తీశారు. దీనిపై జిల్లా ఎస్పీ నరసింహకు ఫిర్యాదు చేశారు బాధితులు.
ఎస్ఐ సైదులు వేధింపులు తట్టుకోలేని మహమ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి 2025 అక్టోబర్ 30న హైదరాబాద్ మల్టీజోన్ 2 డిఐజికి కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. భూమి వివాదంలో ఎస్సై సైదులు 50 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే నీపై కేసు పెట్టి రిమాండ్ చేస్తా అని పోలీస్ స్టేషన్ లో వేధించాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సై పై విచారణ చేపట్టారు ఉన్నత స్థాయి అధికారులు. స్టేషన్లో నిద్రపోతు ఇవాళ మరోసారి బుక్కయ్యాడు ఎస్ఐ సైదులు.
ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే తప్పులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే సెటిల్ మెంట్లు,దందాల పేరుతో దోచుకు తినడమే గాకుండా..నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సస్పెన్షన్ కు గురవుతూ పోలీస్ శాఖకు మాయనిమచ్చగా మారుతున్నారు.
