యాదాద్రి జిల్లాలోని భారీగా బేరసారాలు...ఒక్కో కౌన్సిలర్‌‌‌‌ కు రూ. 5 లక్షలపైనే

యాదాద్రి జిల్లాలోని భారీగా బేరసారాలు...ఒక్కో కౌన్సిలర్‌‌‌‌ కు  రూ. 5 లక్షలపైనే
  • కొన్ని మున్సిపాలిటీల్లో రూ. 15 లక్షల కన్నా ఎక్కువ
  •     నేడు బీ ఫారాలు..  చైర్‌‌‌‌పర్సన్ల​ ఎన్నిక 
  •     విప్​ల నియామకం

యాదాద్రి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో చైర్​పర్సన్​ఎన్నికకు ఒక్క ఓటు తక్కువైంది. ఇండిపెండెంట్​తో బేరసారాలు మొదలయ్యాయి. సదరు ఇండిపెండెంట్​ రూ. కోటి డిమాండ్​ చేశాడు. ‘నీవు కలసి రాకుంటే.. ఇంకో కౌన్సిలర్​ రావడానికి రెడీగా ఉన్నాడు నీ ఇష్టం’ అంటూ చైర్మన్​ సీటు ఆశిస్తున్న వ్యక్తి స్పష్టంగా చెప్పేశాడు. చివరకు రూ. 15 లక్షలకు బేరం కుదరడంతో సదరు ఇండిపెండెంట్​ కారు ఎక్కేశాడు.  మరో మున్సిపాలిటీలో సరిపోనూ ఓట్లున్నాయి. అయినా సొంత పార్టీ కౌన్సిలర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. చైర్‌‌‌‌పర్సన్​ పదవి అశిస్తున్న కౌన్సిలర్​తనకు పదవి ఓకే అయితే ఆస్తిలో కొంత భాగం  అమ్మడానికి రెడీగా అయ్యాడు. ఈ మున్సిపాలిటీ చైర్​ పర్సన్​గా ఎవరిని చేయాలో ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోనున్నారు. 

యాదాద్రి, వెలుగు:   కౌన్సిలర్లతో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం చైర్​పర్సన్​, వైస్​చైర్​పర్సన్​ఎవరో తేలిపోనుంది. రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకూ ఖర్చుచేసి గెలిచిన కౌన్సిలర్లకు ఇప్పుడు డిమాండ్​ చేసే అవకాశం వచ్చింది.  క్యాంపుల్లో ఉన్న  కౌన్సిలర్లతో చైర్‌‌‌‌పర్సన్‌‌ సీటు ఆశిస్తున్న వారు బేర సారాలు సాగిస్తున్నారు.  సొంత పార్టీ నుంచే గెలిచిన కౌన్సిలర్లకే మున్సిపాలిటీ స్థాయిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ముట్టజెప్పడానికి ఒప్పుకుంటున్నారు.

కౌన్సిలర్ల సంఖ్యను బట్టి ఒక్కో మున్సిపాలిటీలో రూ. 40 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకూ చెల్లింపులు చేయడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ డబ్బు చెల్లింపులు చేయడానికి కొందరు ఆస్తులు అమ్మడానికి కూడా రెడీ అయిపోతున్నారు. వైస్​ చైర్‌‌‌‌పర్సన్​ పదవి ఆశిస్తున్న వారు కూడా కౌన్సిలర్లకు తమ వంతుగా కొంత అమౌంట్​చెల్లించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 

నేడు బీ ఫారాలు జారీ, చైర్‌‌‌‌పర్సన్​ల ఎన్నిక

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్‌‌‌‌పర్సన్‌‌ల ఎన్నిక జరగనుంది. మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటికే  చైర్‌‌‌‌పర్సన్లను ప్రకటించినా..  వైస్‌‌​ చైర్‌‌‌‌పర్సన్లను ప్రకటించలేదు. చౌటుప్పల్, భువనగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చైర్‌‌‌‌పర్సన్లు, వైస్​చైర్‌‌‌‌పర్సన్లకు పీసీసీ ప్రెసిడెంట్​బీ ఫారాలు ఇస్తారు. 

వారినే ఎన్నుకోవాలని విప్​ జారీ చేయనున్నారు. కాంగ్రెస్​ తరఫున ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలకు డీసీసీ ప్రెసిడెంట్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మోత్కూరుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, చౌటుప్పల్​కు మాజీ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, పోచంపల్లికి భారత లవకుమార్​, భువనగిరికి కూర వెంకటేశ్​కు  విప్​ జారీ చేసే అధికారాలు అప్పగించారు. 

వివిధ ప్రాంతాల్లో క్యాంపుల్లో కొనసాగుతున్న కౌన్సిలర్లు నేరుగా బస్సులు లేదా కార్లలో మున్సిపాలిటీ వద్దకు ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తారు. అనంతరం చైర్‌‌‌‌పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​ ఎన్నికలో పాల్గొంటారు. మోత్కూరు మున్సిపల్ చైర్​పర్సన్​గా  గడ్డం స్వప్న, వైస్ చైర్​పర్సన్​గా పల్లెర్ల వెంకన్న ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మొగుళ్ల అనురాధ  కాంగ్రెస్ లో చేరారు.