తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఒక వేళ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తే ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై బీజేపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలను అలర్ట్ చేసింది.
ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే నెల రోజుల పాటు బీజేపీ అగ్ర నేతలు ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారు. బీజేపీ భరోసా, ప్రజాగోస పేరుతో 119 నియోజకవర్గాల్లో ర్యాలీలు.. వీటితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాని మోడీతో హైదరాబాద్ లో ముగింపు సభ నిర్వహించనున్నారు.
ఈ నెల రోజుల ప్రచారంలో బీజేపీ నాయకులు, నేతలు బీఆర్ఎస్ వైఫల్యాలను, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఉన్న సంబంధంను హైలెట్ చేయనున్నారు. సీబీఐ చార్జ్ షీట్ లో తన కూతురి పేరు వస్తే స్పందించని సీఎం కేసీఆర్.. మనీష్ సిసోడియా అరెస్ట్ ను ఖండించారు. త్వరలోనే కవితను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
