
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపై అవలంభిస్తున్న కఠిన తీరు భారతీయ ఔత్సాహిక విద్యార్థులను సైతం నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రస్తుతం వీసాల ప్రాసెసింగ్ అమెరికా తాత్కాలికంగా నిలుపుదల చేయటంతో పాటు అమెరికాలోని విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు, విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించాలంటూ ట్రంప్ ఒత్తిళ్లతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడున్న వాతావరణంలో అమెరికా వెళ్లటం ప్రమాదకరంగా వారు భావిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం రెండు రోజుల కిందట కొత్తగా అమెరికా కళాశాలల్లో చదువుకోవటానికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్ వేస్తున్నట్లు వచ్చిన ప్రకటన చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు మాత్రం ఈ చర్య తాత్కాలికమైనదని, సిస్టమ్ అప్డేట్ కోసం జరిగిందంటున్నారు. అయితే అమెరికాలో చదవటానికి వెళ్లేవారికి స్క్రీనింగ్ కఠినతరం చేస్తున్న తరుణంగా వారి సోషల్ మీడియా యాక్టివిటీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో వేల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
కనీసం 2 నుంచి 4 ఏళ్ల పాటు చదువుకోవటానికి వెళుతున్న విద్యార్థులు అన్నీ పూర్తిగా ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత డిపోర్ట్ అయితే అటు అకడమిక్స్ పరంగా ఇటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు మాత్రం ప్రస్తుత పరిస్థితులపై వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు.
మరోపక్క పెరుగుతున్న ఆందోళనలతో మరికొందరు విద్యార్థులు జర్మనీ, ఐర్లాండ్, యూఏఈ, ఫ్రాన్స్, నెథర్లాండ్స్, ఫిన్లాండ్ వంటి దేశాలకు వెళ్లటానికి ఇష్టపడుతున్నట్లు వీసా కన్సల్టెన్సీ సంస్థల డేటా చెబుతోంది. ఈ క్రమంలో యూకే, కెనడాకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉన్నట్లు తేలింది. ఇన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ అమెరికాలో విద్య తమ కలగా ప్రథమ ప్రాధాన్యంతో ముందుకు సాగుతున్నారని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే వేల మంది విద్యార్థుల వీసా అప్లికేషన్లు రద్దవుతున్నాయి.