పూరీ జగన్నాథ్ ను దర్శించుకున్న అమిత్ షా

పూరీ జగన్నాథ్ ను దర్శించుకున్న అమిత్ షా

ఒడిశాలోని  పూరి జగన్నాథ స్వామిని  దర్శించుకున్నారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శనివారం పొద్దున  పూరీకి చేరుకున్న అమిత్ షా  ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు కేంద్రమంత్రి   ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్  చంద్ర సారంగి  కూడా పూజల్లో  పాల్గొన్నారు. హోంమంత్రి  పర్యటనతో  ఒడిశాలో భారీ  భద్రత ఏర్పాటు  చేశారు పోలీసులు.

శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలిసి లంచ్ చేశారు. ఇందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇల్లు వేదికైంది. ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీట్ లో భాగంగా బెంగాల్ సీఎం మమత, బీహార్ సీఎం నితీష్ ఒడిశాకు వచ్చారు. ఇదే సమయంలో భువనేశ్వర్ లో బీజేపీ సభకు అమిత్ షా కూడా రావటంతో వీరందరినీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లంచ్ కు ఆహ్వానించారు.  మూడు రాష్ట్రాల సీఎంలు, అమిత్ షా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతా కలిసి లంచ్ చేశారు.

అమిత్ షా, మమత  ఇద్దరు ఒకే డైనింగ్ టేబుల్ పై ఎదురెదురుగా కూర్చొని భోజనం చేశారు. ఈ ఫోటోలను నవీన్ పట్నాయక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హ్యాపీగా ఉంది. లంచ్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నామని ట్వీట్ చేశారు. ఎప్పడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వాళ్లు కలిసి భోంచేయటంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.   అరుదైన కలయిక అమోఘం అంటూ కొందరు.. ఈ భేటీ దేనికి దారితీస్తుంది? అని మరికొందరి కామెంట్ చేస్తున్నారు

ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ భేటీ, నవీన్ ఇంట్లో లంచ్ ముగిసిన కొద్దిసేపటికే.. CAAకు మద్దతుగా బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు అమిత్ షా. సీఏఏకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు తీర్మానాలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలపై అమిత్ షా ఫైరయ్యారు. సీఏఏ వల్ల మనదేశంలో ఉన్న ఒక్క ముస్లిం కూడా సిటిజన్ షిప్ కోల్పోడని అమిత్ షా స్పష్టంచేశారు. దీనిపై కాంగ్రెస్, కమ్యూనిస్టులు,ఎస్పీ, బీఎస్పీ, మమత తప్పుడు ప్రచారం చేస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపించారు. సీఏఏపై గందరగోళం సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ప్రతిపక్షాలను కోరారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెల్చుకున్న తర్వాత షా.. ఒడిశా రావటం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్ర పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది.