
- భద్రతా అధికారులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశం
- జమ్మూకాశ్మీర్లో వరుస టెర్రర్ అటాక్లపై హైలెవల్ మీటింగ్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఇటీవల వరుస టెర్రర్ అటాక్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. జమ్మూలో టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. లోయ ప్రాంతంలోని అన్ని మార్గాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను పెంచాలని అమిత్ షా ఆదేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
జమ్మూకాశ్మీర్లో మళ్లీ పెరుగుతున్న టెర్రరిజానికి అడ్డుకట్ట వేయాలన్నారు. జమ్మూలో ఏరియా డామినేషన్ ప్లాన్, జీరో టెర్రర్ ప్లాన్ ద్వారా సాధించిన విజయాలను కాశ్మీర్ లోయలో పునరావృతం చేయాలని ఆదేశించారు. వైష్ణోదేవి, శివఖోరితో సహా అన్ని పుణ్య క్షేత్రాలను సంరక్షించేందుకు సమన్వయంతో కృషి చేయాలని చెప్పారు. హైవేల వెంబడి అదనపు భద్రతా బలగాలను మొహరించడంతో పాటు జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టులను, వారి మద్దతుదారులను గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవాలన్నారు.
సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాటు ప్రాంతాలను గుర్తించి వాటిని మూసివేయాలని చెప్పారు. జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనున్న అమర్నాథ్ యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భారీ భద్రతను కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజయ్ భల్లా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ డిజిగ్నేట్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిశ్ దయాళ్ సింగ్, జమ్మూకాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, గత వారం జమ్మూ కాశ్మీర్లోని రియాసి, కథువా, దోడా జిల్లాల్లోని నాలుగు చోట్ల టెర్రరిస్టులు దాడిచేసి 9 మందిని చంపేశారు. ఇందులో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా ఉన్నారు.