2036 ఒలింపిక్స్‌పై ఫోకస్.. భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చడమే మోడీ సర్కార్ లక్ష్యం: అమిత్ షా

2036 ఒలింపిక్స్‌పై ఫోకస్.. భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చడమే మోడీ సర్కార్ లక్ష్యం: అమిత్ షా

Global Sports Hub: భారత్‌ను ప్రపంచ క్రీడల రాజధానిగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా అంతర్జాతీయ క్రీడోత్సవాల ఏర్పాట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి పాల్గొన్న ఈ మీటింగ్‌లో 2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఏర్పాట్లతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య బిడ్‌పై సుదీర్ఘంగా చర్చించారు.  

20 ఏళ్ల తర్వాత ఇండియాకు కామన్‌వెల్త్ గేమ్స్:

గతంలో 2010లో ఢిల్లీ వేదికగా చివరిసారిగా కామన్‌వెల్త్ గేమ్స్ జరిగాయి. సరిగ్గా 20 ఏళ్ల విరామం తర్వాత 2030లో ఈ మెగా ఈవెంట్ మళ్లీ ఇండియాకు, అదీ అహ్మదాబాద్ నగరానికి రాబోతోంది. కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభమై వందేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంలో జరిగే ఈ వందో ఎడిషన్‌కు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఈ ఈవెంట్‌కు సంబంధించిన భద్రత, రవాణా బాధ్యతలను కేంద్ర హోంశాఖ దగ్గరుండి పర్యవేక్షించనుంది.

2036 ఒలింపిక్స్ బిడ్.. అసలు నిర్ణయం ఎప్పుడంటే: 

వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ అయిన 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం అహ్మదాబాద్ గట్టిగా పోటీ పడుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)తో కంటిన్యూయస్ డయలాగ్ దశలో ఉన్నామని, దీనిపై తుది నిర్ణయం 2029 నాటికి వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ఐఓసీ ప్రతినిధులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు.

2029లోనే బిగ్ ట్రైలర్.. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్: 

కామన్‌వెల్త్, ఒలింపిక్స్ క్రీడల కంటే ముందే అహ్మదాబాద్ నగరం 2029లో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 70 దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనే ఈ టోర్నీ, అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తొలి అంతర్జాతీయ మల్టీ-స్పోర్ట్ ఈవెంట్ కానుంది. ఈ ఈవెంట్స్ ద్వారా నిర్మించే స్టేడియంలు, ఇతర మౌలిక వసతులు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.