రాఖీ స్పెషల్..రూ.199కే కిలో స్వీట్ ఆఫర్ ..ఎగబడ్డ జనం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

రాఖీ స్పెషల్..రూ.199కే కిలో స్వీట్ ఆఫర్ ..ఎగబడ్డ జనం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక్కసారిగా హైడ్రామా నెలకొంది. కేవలం రూ.199లకే కిలో స్వీట్లు, అదనంగా రాఖీ, కీ చైన్ ఉచితం అంటూ ఓ స్వీట్ షాప్ యాజమాన్యం ప్రకటించిన బంపర్ ఆఫర్ స్థానికంగా భారీ కలకలం రేపింది.

'స్వీట్ టోన్' మిఠాయి షాపు యాజమాన్యం సోషల్ మీడియాలో ఇచ్చిన ఈ ప్రకటన చూసి జనం ఎగబడ్డారు. తక్కువ ధరకే స్వీట్లు, ఉచితంగా రాఖీలు వస్తాయన్న ఆశతో ఉదయం నుంచి జనం ఎగరగబడి షాప్ ముందు బారులు తీరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ భారీ జనసమూహం చేరింది.

ఈ భారీ జనాల కారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి నారాయణగూడ వరకు రోడ్డంతా కిక్కిరిసిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆ స్వీట్ షాపును బలవంతంగా మూసివేయించారు. గుమిగూడిన జనాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సరైన అనుమతులు లేకుండా, ఇలా రోడ్లపై ట్రాఫిక్‌కు విఘాతం కలిగించేలా ఆఫర్లు ప్రకటించిన షాపు యాజమాన్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.