Nepal Flash Floods: నేపాల్ వరదల బీభత్సం.. తృటిలో తప్పించుకున్న నటుడు అంకుర్ రతన్.. కన్నీటిసంద్రంలో ఈశా ఫౌండేషన్

Nepal Flash Floods: నేపాల్ వరదల బీభత్సం.. తృటిలో తప్పించుకున్న నటుడు అంకుర్ రతన్.. కన్నీటిసంద్రంలో ఈశా ఫౌండేషన్

ప్రకృతి కోపానికి నేపాల్‌ టిబెట్ సరిహద్దులు అల్లకల్లోలమయ్యాయి. ఆకస్మిక వరదలు (Flash Floods), కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా శ్మశానవాటికను తలపిస్తోంది. వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. మంచు, మట్టి, రాళ్లు, వరదనీరు ఒక్కసారిగా విరుచుకుపడటంతో గ్రామాలు, రహదారులు, వంతెనలు, వాహనాలు కొట్టుకుపోయాయి.  కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి..

300 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు.. 

హిమాలయాల నడుమ ఆధ్యాత్మిక యాత్రగా విషాదంగా మారింది. ఈ ప్రకృతి బీభత్సంలో ఇప్పటివరకు 175 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.  కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన భక్తులతో పాటు 300 మందికి పైగా భారతీయుల ఆచూకీ గల్లంతవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

 

కన్నీటిసంద్రంలో ఈశా ఫౌండేషన్..

ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద వరద తాకిడికి గురై, కైలాస యాత్ర నుండి తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈశా వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం సాగా క్యాంప్‌లో ఉన్న ఆయన, టిబెట్‌లోని అత్యంత ప్రభావిత గైరాంగ్ ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అనుమతించాలని భారత్, చైనా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. దారులు కొట్టుకుపోవడంతో బాధితుల వద్దకు వెళ్లలేకపోతున్నానని ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

భయానక అనుభవాలు - తృటిలో తప్పిన ముప్పు

ఈ ప్రళయం మధ్య ముంబైకి చెందిన నటుడు అంకుర్ రతన్ తన కుటుంబంతో కైలాస యాత్రలో ఉండగా..  ప్రళయ కోరల నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు నటి మానసి పరేఖ్ కూడా ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటూ అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను, దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

 

స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు..

ఈ హృదయ విదారక ఘటనపై భారతీయ చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నా ప్రార్థనలు, ఆలోచనలు నేపాల్ వరద బాధితులతోనే ఉన్నాయి. ఈ కష్ట సమయంలో మీకు అండగా ఉంటాను అని ధైర్యం చెబుతూ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. సర్వస్వం కోల్పోయిన వారి వేదన వర్ణనాతీతం అని ఎమోషనల్ అయ్యారు  ఫర్హాన్‌ అక్తర్.. 

 

నేపాల్.. మీరు ఒంటరి కాదు. ఆహారం, ఆశ్రయం మరియు పునర్నిర్మాణ బలాన్ని అందించడానికి మేము వస్తున్నాం అంటూ తన మద్దతు తెలిపారు బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్. ఈ ఘోర ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలిపారు నటి కంగానా రనౌత్. మీ అందరి తాము అండగా ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.  బాధితులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌లు శ్రమిస్తున్నప్పటికీ, తమ వారి ఆచూకీ కోసం వందలాది కుటుంబాలు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నాయి.