విద్యార్థుల హంతకులకు శిక్ష పడుతుందని షా హామీ ఇచ్చారు : బీరెన్ సింగ్

విద్యార్థుల హంతకులకు శిక్ష పడుతుందని షా హామీ ఇచ్చారు : బీరెన్ సింగ్

మణిపూర్ లో ఇద్దరు విద్యార్థుల హత్యకు సంబంధించి ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ.. నిందితులను అరెస్టు చేసి శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసును అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నాయని ఆయన తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారని, ఈ విషయాన్ని తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని బీరెన్ సింగ్ వెల్లడించారు.

ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణించాలని, చట్టం ప్రకారం బాధ్యులపై కేసు నమోదు చేయాలని షా తనతో చెప్పారని బీరేన్ సింగ్ చెప్పారు. ఎవరినీ విడిచిపెట్టబోమని హోంమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఏజెన్సీ స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ అధికారుల బృందం సెప్టెంబర్ 27న మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకుని ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.

అంతకుముందు జూలైలో కిడ్నాప్‌కు గురైన ఫిజామ్ హేమ్‌జిత్ (20), హిజామ్ లింతోంగంబి (17) అనే ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫొటోలు సెప్టెంబర్ 25న సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇంఫాల్ లో రెండు రోజులుగా జరుగుతున్న నిరసనల్లో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో పాటు ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడంతో దాదాపు 150 మంది విద్యార్థులు గాయపడ్డారు.