- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర సర్కారు నియమించింది. ఈ మేరకు గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. కో చైర్మన్గా విద్యావేత్త శ్రీనివాస్ సి. రాజును నియమించింది. ఆయన కూడా ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, కొన్నాళ్ల క్రితం సీఎం రేవంత్ రెడ్డి.. ఆనంద్ మహీంద్రతో సమావేశమయ్యారు. యువతలో నైపుణ్యాలను పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లుకూ ఆమోదం లభించింది.
