రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ముకేశ్, నీతా అంబానీల చిన్నకుమారుడైన అనంత్ అంబానీకి వీరెన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె, ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో రాధిక మర్చంట్ తో వివాహం నిశ్చయమైంది. వీరి నిశ్చితార్థ వేడుకను రాజస్థాన్లోని శ్రీనాథ్జీ ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ముందు నుంచే అంబానీ కుటుంబం, మర్చంట్ కుటుంబంతో మధ్య సత్సంబంధాలుండడంతో వారి ప్రేమ కాస్తా.. పెళ్లికి దారి తీసింది.
న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన రాధిక మర్చంట్ కు.. కాబోయే అత్తమామలు ముకేశ్-, నీతాలు ఇటీవలే జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా ‘అరంగేట్రం’ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్ కుటుంబాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

