- టీజీఎఫ్డీడీసీతో పదేండ్ల లీజు ఒప్పందం
- నిబంధనల మేరకే రెంట్ చెల్లిస్తున్నామన్న ‘అనన్య’ నిర్వాహకులు
హైదరాబాద్, వెలుగు : వనస్థలిపురంలోని ‘మహావీర్ నిశ్చల్వన్ ఎకో టూరిజం సెంటర్’ నిర్వహణపై వస్తున్న ఆరోపణలను అనన్య రిసార్ట్స్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఈ టూరిజం సెంటర్, అభివృద్ధి, నిర్వహణ కోసం 2016 అక్టోబర్ 5 నుంచి 2026 అక్టోబర్ 4 వరకు పదేండ్ల కాలపరిమితితో తెలంగాణ స్టేట్ఫారెస్ట్డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.
అగ్రిమెంట్ ప్రకారం మొదటి మూడేండ్లు ఏడాదికి రూ. 17.30 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించామని, ఆ తర్వాత ఏటా పెరుగుతూ వచ్చిందన్నారు. పదో సంవత్సరానికి వార్షిక లీజు మొత్తం రూ. 24,37,698కి చేరుకుందని, దీనికి అదనంగా మొత్తం రెవెన్యూలో 3 శాతం వాటా ప్రభుత్వానికి అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి లీజునిధులను ఎప్పటికప్పుడు బ్యాంకు ద్వారా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఎకో టూరిజం సెంటర్ను నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.
