అనసూయ పవర్ ఫుల్ యాక్షన్ “కథనం” టీజర్

అనసూయ పవర్ ఫుల్ యాక్షన్ “కథనం” టీజర్

అనసూయ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కథనం. ఉమెన్స్ డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీలోని టీజర్ ను రిలీజ్ చేశారు. ‘అను నువ్వు మొట్టమొదట ఏ సినిమా తీసినా.. బ్యానర్‌ బాబాయ్‌దే పడాలి. నేను కమిట్‌ అయిపోయాను’ అనే డైలాగ్‌ తో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులో అనసూయ డైరెక్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సినిమా తీయడానికి రాసుకున్న స్క్రిప్టు నిజ జీవితంలో జరుగుతుంటుంది. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డట్లు టీజర్‌ లో చూపించారు. ‘మీరు నమ్మినా, నమ్మకపోయినా.. నేను రాశాను, రాసిందే జరిగింది’ అని అనసూయ గట్టిగా అధికారితో చెప్పింది. ‘నిర్ణయాలు తీసుకునేవారు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేలుకుంటారు సర్‌’ అంటూ పవర్‌ ఫుల్‌  డైలాగ్ తో టీజర్ ముగిస్తుంది.

రాజేశ్ నాదెండ్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. ది మంత్ర ఎంట‌ర్‌ టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా నిర్మాత‌లు. ‘క్ష‌ణం, రంగ‌స్థ‌లం’ సినిమాలతో ఆకట్టున్న అనసూయ.. ఇప్పుడు ‘క‌థ‌నం’తో హ్యాట్రిక్ కొట్టబోతోందంటున్నారు ఫ్యాన్స్. ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది యూనిట్. అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.