అమరావతి : ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ స్థానంలో ‘ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లు 2023’ ద్వారా కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం బుధవారం ముగిసింది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు, 12వ పీఆర్సీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్ మెంట్లలో 6,840 పోస్టులు భర్తీ చేయాలని, వైద్య విధాన పరిషత్ ను రద్దుచేసి, అందులో పనిచేస్తున్న 14,653 సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.