తిరుమలలో భక్తుల ఆగ్రహం

తిరుమలలో భక్తుల ఆగ్రహం

కరోనా కేసులు పెరుగుతున్నాయని సర్వదర్శనాలు నిలిపివేయడంపై అసహనం

హఠాత్తుగా దర్శనాలు రద్దు అంటే ఎలా అంటూ కౌంటర్ల వద్ద సిబ్బందితో వాగ్వాదం

క్యూలో ఉన్న వరకు అనుమతిచ్చిన అధికారులు..

రేపటి నుండి నెలాఖరు వరకు సర్వ దర్శనాలు నిలిపివేత- టీటీడీ ప్రకటన

తిరుపతి: టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నట్లుండి సర్వదర్శనాలను నిలిపివేయడంతో అలిపిరి వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. తిండి, నిద్ర లేకుండా భూదేవి కాంప్లెక్స్ ముందు ఇవ్వాల్టి దర్శనం కోసం వేలాది మంది భక్తులు నిన్న సాయంత్రం నుండి ఎదురు చూస్తున్నారు. అయితే టీటీడీ ఉన్నట్లుండి రాత్రి సర్వదర్శనాలను నిలిపివేసింది. దీంతో సర్వదర్శనం టోకెన్లను ఆపివేసే విషయాన్ని ముందే ప్రకటించక పోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కిలోమీటర్ల నుండి వచ్చిన తమకు దర్శనం కల్పించాలని, ఈ రోజు వరకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చి  ఆ తరువాత ఆపాలని భక్తులు డిమాండ్ చేశారు. దీంతో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్నవారి కోసం 3000 సర్వ దర్శనం టోకెన్లను జారీ చేసింది. ఈనెల 30వ తేదీ వరకు ఇక సర్వ దర్శనం టోకెన్స్ ఇచ్చేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.