
యాజమాన్యంపై ఆర్టీసీ యూనియన్ల ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదో తేదీ వచ్చినా ఎంప్లాయిస్కు జీతాలు ఇవ్వకపోవడంపై ఆర్టీసీ యూనియన్లు మండిపడుతున్నాయి. జీతాలు చెల్లించకపోవడాన్ని ఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఖండించింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మండిపడ్డారు. మేనేజ్మెంట్ వెంటనే జీతాలు చెల్లించాలని ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కమాల్ రెడ్డి కోరారు. జీతాల విషయంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కర్నాటక, మహారాష్ట్ర గురించి చెబుతున్నారని, ఏపీ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీకి ఖజానా నుంచి పైసలొస్తలె.. జీతాల గురించి ఉద్యోగులు టెన్షన్ వద్దు: మంత్రి పువ్వాడ
రాష్ట్ర ఖజానా నుంచి ఆర్టీసీ సంస్థకు డబ్బులు రావడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. జీతాలు లేటు అవడంపై ఉద్యోగులు టెన్షన్పడాల్సిన అవసరం లేదని.. మహారాష్ట్ర ఆర్టీసీలో 5 నెలలుగా, కర్నాటకలో 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. గురువారం హైదరాబాద్లోని ట్రాన్స్పోర్ట్ భవన్లో తొలి దశలో భాగంగా హైదరాబాద్లో పార్సిల్, కొరియర్ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించారు. ఆర్టీసీలో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ కమిటీలు యూనియన్లు లెక్క పని చేయవని, సంస్థలో ఉద్యోగులపై అధికారుల వేధింపులు లేవన్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే మంచి కబురు చెబుతామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుకు మంచి ఆదరణ వస్తోందని, వీటి ద్వారా రోజుకు రూ. 15లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని, రానున్న రోజుల్లో రూ.25లక్షలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూకట్పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ సెంటర్ల వారీగా విభజించి హోం డెలివరీ చేస్తామన్నారు. ఆర్టీసీ ఆదాయం క్రమక్రమంగా పెరుగుతోందని, రోజుకు రూ. 10 కోట్లు, 65 శాతం ఓఆర్ నమోదవుతోందన్నారు. కరోనాకు ముందు 75% ఓఆర్ ఉండేదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని కొన్ని రూట్లలో నడిపేందుకు 40–50 డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయన్నారు. నగరంలో తిరుగుతున్న బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు.