Anil Ambani: అంబానీ స్టాక్ పరుగులు.. డిఫెన్స్ రంగంలో కొత్త చరిత్ర..

Anil Ambani: అంబానీ స్టాక్ పరుగులు.. డిఫెన్స్ రంగంలో కొత్త చరిత్ర..

Reliance Infra Stock: ప్రస్తుతం ఒకప్పుడు దివాలా తీయటంతో కనుమరుగైన అనిల్ అంబానీ తిరిగి పుంజుకుంటున్నారు. ఆయన సంస్థలు చేస్తున్న డీల్స్, పెట్టుబడులు చూస్తుంటే తిరిగి ఫ్యూచర్ లో అనిల్ రెండోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో తిరిగి తళుక్కుమనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ ఫ్రా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ తర్వాతి తరం 155 ఎంఎం ఆర్టిలరీ మందుగుండును అభివ-ృద్ధి చేసిన తొలి ప్రైవేటు భారతీయ సంస్థగా నిలిచింది. యుద్ధ భూమిలో సుదీర్ఘ దూరాల్లోని టార్గెట్లను పేల్చేందుకు ఇది చాలా కీలకమైన మందుగుండుగా ఉంది. కంపెనీ డీఆర్డీవోతో డిజైన్ అండ్ ప్రొడక్షన్ ప్రాతిపధికన ఒప్పందం కుదుర్చుకుంది. మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ ఆయుధాల తయారీ కోసం జరుగుతున్న ప్రోత్సాహకంలో భాగంగా రిలయన్స్ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ముందుకొచ్చింది. 

ప్రస్తుతం కంపెనీ 155 ఎంఎం కేటగిరీ కింద నాలుగు రకాల షెల్స్ తయారు చేసినట్లు వెల్లడైంది. డిజైన్ ప్రక్రియ పూర్తికావటంతో వాటి ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. వేగంగా ఉత్పత్తిని కొనసాగించటానికి 10 వివిధ సంస్థలను సప్లై చైన్ కోసం నియమించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో రానున్న కాలంలో  దశాబ్దంలో రక్షణ మంత్రిత్వ శాఖ నుండి రూ.10వేల కోట్ల వ్యాపారమే లక్ష్యంగా అంబానీ కంపెనీ ముందుకు సాగుతోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ ఎంపిక ప్రక్రియలో, ప్రభుత్వ రంగ యూనిట్ అయిన యంత్ర ఇండియా లిమిటెడ్‌తో పాటు రిలయన్స్ ఇన్‌ఫ్రా ఏకైక ప్రైవేట్  భాగస్వామిగా ఉంది. 2032 నాటికి భారత్ తన మందుగుండు సామాగ్రి కొనుగోలు ఖర్చులను రూ.12వేల కోట్లకు పెంచుతుందని ఇటీవల కేపీఎంజీ సంస్థ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అనిల్ అంబానీ దీర్ఘకాలిక రక్షణ వ్యూహంలో భాగంగా.. రిలయన్స్ మహారాష్ట్రలోని రత్నగిరిలోని ధీరూభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ (DADC)లో గ్రీన్‌ఫీల్డ్ మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అనిల్ అంబానీ ఈ మెగా డిఫెన్స్ ప్రాజెక్ట్ కోసం రానున్న కాల్లో రూ.5వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డిఫెన్స్ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోని రత్నగిరిలోని వాతాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ కంపెనీకి 1,000 ఎకరాల భూమి కేటాయించబడింది. తాజా వార్తలు భయటకు రావటంతో రిలయన్స్ ఇన్ ఫ్రా షేర్లు నేడు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. సాయంత్రం 3.10 గంటల సమయంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి 10 శాతానికి పైగా లాభంతో రూ.378 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తు్న్నాయి.