
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో మరో కోణం వెలుగుచూసింది. ఆయన అవినీతి వెనుక ఓ ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరుసగా మూడో రోజు ఆయనను ఏసీబీ విచారిస్తోంది. ఆయనకు చెందిన 8 బ్యాంకు లాకర్లు, డిపాజిట్లు, బాండ్లు, పలు కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తోంది. అయితే బ్యాంకు లాకర్ల వివరాలు గోప్యంగా ఉంచారు. ఇల్లీగల్ లే అవుట్ అనుమతులు, టెక్నీకల్, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కాగా.. శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించింది. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివబాలకృష్ణను ఏసీబీకి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.