న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏండ్ల నైజీరియన్ మహిళకు టెస్ట్ చేయగా, బుధవారం మంకీపాక్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు, దేశంలో తొమ్మిదికి పెరిగింది. అయితే, దేశంలో మంకీపాక్స్ వచ్చిన మొదటి మహిళ ఈమెనే అని అధికారులు పేర్కొన్నారు. ఆమె ట్రావెల్ హిస్టరీపై ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు.
గైడ్లైన్స్ పున:పరిశీలనకు కేంద్రం నిర్ణయం
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నందున గైడ్లైన్స్ను పున:పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గురువారం హెల్త్ ఎక్స్పర్ట్స్తో మీటింగ్ నిర్వహించింది. ఇదొక టెక్నికల్ మీటింగ్ అని, గైడ్లైన్స్ను పున: పరిశీలించేందుకు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్. స్వస్తిచరణ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో నేషనల్ ఏయిడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో ఇప్పటివరకు మంకీపాక్స్తో ఒకరు మరణించారు.